ఆర్కే.. మా ప్రభుత్వంలో మీపై విచారణ ఖాయం

Update: 2019-04-08 08:58 GMT
రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లకూడదు. కానీ.. తాజా రాజకీయం అలాంటి పరిస్థితే నెలకొంది. ఎవరికి నచ్చిన రాజకీయ ఎజెండా వారికి ఉండటం తప్పు కాదు. కానీ.. వ్యక్తిగతంగా కక్ష కట్టినట్లుగా టార్గెట్ చేయటం సరికాదు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో వెల్లువెత్తుతున్న స్పందన తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ యజమానికి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేస్తూ ఒక వీడియో విడుదల కావటం.. అది కాస్తా వైరల్ అయి.. సంచలనాన్ని క్రియేట్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణా పై దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. ఆయనకు చంద్రబాబు ఇచ్చిన రూ.1500 కోట్లపైనా.. పనుల అంచనాల్ని పెంచటంలో ఆర్కే పాత్ర పైనా విచారణ చేయిస్తామని ప్రకటించారు.  మీడియా ముసుగులో ఆర్కే చేసిన దళారి వ్యవహారాల జాబితా తమ వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్లు చూస్తే..

-  రాధాకృష్ణా! చంద్రబాబు మీకు దోచిపెట్టిన రూ.1500 కోట్ల పైనా - పనుల అంచనాలను పెంచడంలో మీపాత్ర పైనా, మీకు అందిన కమిషన్లపైనా మా ప్రభుత్వం రాగానే దర్యాప్తు జరిపిస్తాం. మీరు బొక్కిన ప్రజా ధనాన్ని ప్రతి కాణీ కక్కిస్తాం. మీడియా ముసుగులో మీరు చేసే దళారి వ్యవహారాల చిట్టా మాదగ్గర ఉంది.

-  జ్యోతి రాధాకృష్ణలాంటి పచ్చ దళారి తప్పుడు రాతలతో ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. కిరసనాయిలు, రేషన్ బియ్యం స్మగ్లర్‌గా జీవితం మొదలు పెట్టి  ఆయన వేల కోట్లు పోగుచేసుకున్న స్టోరీలన్నీ ప్రజలకు తెలుసు. వేచి చూడు. ఎక్కడ మొదలయ్యరో అక్కడికే చేరతారు.

-   వచ్చే 4 రోజులు ఆంధ్రజ్యోతి - కులమీడియా ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు రేపే కుట్ర పూరిత వార్తలు ఇస్తాయి. కట్టుకథలతో చంద్రబాబుకు జోల పాడతాయి. పోలింగ్ పూర్తయ్యేదాకా ప్రజానీకం వీళ్ల ‘వశీకరణ’ వార్తలను పట్టించుకోవద్దని విజ్ణప్తి చేస్తున్నా. బాధలు, కష్టాలు లేని జగనన్న రాజ్యం వస్తోంది.

-   పప్పుకు నోరు తిరగక ‘మందల’గిరి అని పలికితే చంద్రబాబు ఆస్థాన కులజ్ణానులు విరాట పర్వాన్ని శోధించి చిట్టినాయుడే కరెక్టని తేల్చారట. అర్జునుడు ఆల మందలను మళ్లించింది అక్కడే కాబట్టి ‘మందల’గిరేనని కుండబద్దలు కొట్టారట. మంగళగిరి పేరు సవరించాలని తుప్పునాయుడుకి సిఫార్సు చేశారట.

-   రాజకీయ ప్రముఖుల అక్కా - చెల్లెళ్లు రాఖీలు కట్టే ఫోటోలు మీడియాలో చూస్తుంటాం. చంద్రబాబు మాత్రం తన ఆడపడచులను ఎన్నడూ పిలిచిందీ లేదు చీర సారెలు పెట్టిందీ లేదు. వారికి ఇంటి గుమ్మం తొక్కే అర్హత లేకుండా చేశారు. అలాంటి వ్యక్తి పసుపు కుంకుమని మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు.




Tags:    

Similar News