ఏపీ టూరులో ఏం ప్రస్తావించాలి.. కేసీఆర్‌ మల్లగుల్లాలు!

Update: 2022-10-18 05:44 GMT
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రధానంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 150 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలనేది కేసీఆర్‌ యోచనగా ఉందని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో తెలుగు ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతాలపై కేసీఆర్‌ దృష్టి పెట్టారని అంటున్నారు.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలసి వచ్చారు.. కేసీఆర్‌. అయితే బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశాక కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడులో ఉప ఎన్నిక ఉంది. ఇది నవంబర్‌ 3న ముగుస్తుంది. ఆ తర్వాత కేసీఆర్‌ ఆంధ్రాకు వస్తారని పేర్కొంటున్నారు.

అయితే కేసీఆర్‌ జాతీయ పార్టీపై అధికార వైసీపీ మంత్రులు, నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌ పార్టీకి ఏపీలో డిపాజిట్లు కూడా రావని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో ఏ గతి పట్టిందో.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు కూడా అదే గతి పడుతుందని చెబుతున్నారు. కేసీఆర్‌ కాదు కదా ఆయన తాత దిగి వచ్చినా వచ్చే 30 ఏళ్లు వైఎస్‌ జగన్‌ మాత్రమే ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉంటారని వివరిస్తున్నారు.

అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను, ఆంధ్రుల వంటకాలను, పండుగలను ఉద్దేశిస్తూ కేసీఆర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నేతలెవరూ మరిచిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ టూరు కేసీఆర్‌కు కత్తి మీదే సామే. ఇప్పటివరకు ఆయనకు మద్దతు ప్రకటించిన ఏకైక నేత మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాత్రమే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌  ఏపీకి వస్తే ఏం మాట్లాడతారు? మూడు రాజధానుల అంశంపై ఎలా స్పందిస్తారు? పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడటం, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఉన్నట్టు తోడేయడం, నాగార్జున సాగర్‌లో అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం, ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్స్‌లో కేసులు వేయించడం తదితరాల నేపథ్యంలో ఏపీ టూరు కేసీఆర్‌కు అంత సులువు కాదని చెబుతున్నారు.

ఈ అన్ని అంశాలపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అలాVó  పోలవరం బ్యాక్‌ వాటర్స్‌తో భద్రాచలం మునిగిపోతుందని చెబుతుండటం, పోలవరం ముంపు మండలాల గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతుండటం, వెనుకబడిన జిల్లాల సమస్యలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, రెండు రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు, ఉద్యోగుల విభజన, ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, వి¿¶ జన ఆస్తులు తదితరాలపైన సైతం కేసీఆర్‌ స్పందించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు ఏపీ టూరు కత్తి మీద సామేనని అభిప్రాయపడుతున్నారు. కాగా కేసీఆర్‌ తన సామాజికవర్గం వెలమలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న విజయనగరంలో కానీ లేదా విశాఖపట్నంలో కానీ తొలి సభను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయా ప్రధాన పార్టీల్లో ఉన్న వెలమ సామాజికవర్గం నేతలంతా ప్రధానంగా ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సభ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంటుందని చెబుతున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ పార్టీని ఏపీలో ఎవరూ పట్టించుకోకపోవచ్చనే చెబుతున్నారు. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నాయి. జనసేన పార్టీ సైతం ఇటీవల కాలంలో బాగా బలం పుంజుకుందనే అభిప్రాయాలను వివిధ సర్వే సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలులాంటివి ఎలాగూ ఉన్నాయి. ఇన్ని పార్టీల మధ్య కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను ప్రజలెవరూ పట్టించుకోకపోవచ్చనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News