కేటీఆర్ కోపంగా ఉన్నారా? అందుకే ఢిల్లీకి వెళ్లలేదా?

Update: 2022-12-15 03:56 GMT
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవటం.. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఓకే చెప్పటం.. ఆ వెంటనే బీఆర్ఎస్ గా పార్టీ పేరు మారుస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకొని.. మారిన గులాబీ జెండాను.. పార్టీ పేరును ప్రదర్శిస్తూ కార్యక్రమం చేపట్టటం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ప్రోగ్రాంకు తన సతీమణి.. మనమడు.. కూతురుతో పాటు పార్టీకి చెందిన పలువురు ఢిల్లీకి వచ్చేశారు. ఇంత కీలకమైన కార్యక్రమానికి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ గైర్హాజరు కావటం తెలిసిందే.

అయితే.. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఇదే దిశగా చర్చలు జరుగుతుండటం గమనార్హం. తండ్రి పోకడలపై కేటీఆర్ గుర్రుగా ఉన్నారని.. అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లలేదని చెబుతున్నారు. అయితే.. ఈ వాదన తప్పని.. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కేటీఆర్ అమితంగా గౌరవిస్తారని.. ఆయన మాటకు ఎదురు చెప్పే అవకాశం లేదన్న మాటా వినిపిస్తోంది.

తండ్రి అంటే అమితమైన ప్రేమాభిమానాలతో పాటు గౌరవంతో కూడిన భయం కేటీఆర్ కు మెండుగా ఉంటుందని.. ఇప్పటికి  ఆయన ఎదుట కూర్చునేందుకు సైతం ససేమిరా అనటం రాములో చూస్తామని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాంటి గుణం ఉన్న కేటీఆర్.. తండ్రి మీద అలిగే అవకాశం లేదన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనను కొట్టి పడేస్తూ.. మరో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో మొదలైన దుకాణంతో కొత్త సమస్యలు ఎదురుకావొచ్చన్న ఆందోళన కేటీఆర్ లో ఉందని చెబుతున్నారు.

బీఆర్ఎస్ గా పార్టీని మార్చటం వరకు ఓకే కానీ.. పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలే తప్పించి.. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదన్నది కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. అన్నింటికి మించి మిత్రులుగా ఎంపిక చేసుకునే వారి విషయంలో కేసీఆర్ తొందరపాటుతో ఉన్నట్లుగా కేటీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై తండ్రీ కొడుకుల మధ్య చర్చ జరిగిందని.. అందులో కేటీఆర్ మాటల్ని కేసీఆర్ సింఫుల్ గా కొట్టిపారేయటంతొ మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు. అయితే.. ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ అన్నది మర్చిపోకూడదు.

అయితే.. మంత్రి కేటీఆర్ కు సన్నిహితులు మాత్రం.. కేసీఆర్ పై కేటీఆర్ గుర్రుగా ఉన్నారన్న వాదనలో నిజం లేదని.. మారుతి సుజుకికి చెందిన కీలక  ప్రతినిధులతో ముందస్తుగా షెడ్యూల్ అయినందున.. దానికి అత్యధికప్రాధాన్యత ఇచ్చారన్న మాట వినిపిస్తున్నారు. అయితే.. పార్టీని జాతీయ పార్టీగా మార్చి.. దాని కార్యాలయాన్ని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న వేళ.. ప్రత్యేక విమానంలో డిల్లీకి వెళ్లి రావటం పెద్ద విషయం కాదని.. అందుకు పట్టే సమయం మహా అయితే మూడు.. నాలుగు గంటలని గుర్తు చేస్తున్నారు. నిజంగానే వెళ్లి రావాలని డిసైడ్ అయితే.. మారుతి సుజుకీ ప్రతినిధులతో  భేటీ కంటే ముందుగా.. ఉదయాన్నే వెళ్లి వచ్చేయటం.. లేదంటే భేటీ తర్వాత వెళ్లినా సరిపోయేది కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. మరి.. ఈ తరహా చర్చకు గులాబీ టీం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News