వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఏపీలో భారీ ప్లాన్ కు జగన్ సిద్ధం

Update: 2021-05-29 04:01 GMT
కరోనా సెకండ్ వేవ్ వేళ.. మెరుగైన వైద్యం కోసం ఏపీలోని వివిధ జిల్లాల వారు చెన్నై.. బెంగళూరు.. హైదరాబాద్ లకు పరుగులు తీయటం తెలిసిందే. మరే రాష్ట్రంతోనూ ఇబ్బంది పడని రీతిలో.. హైదరాబాద్ కు వస్తున్న అంబులెన్సుల్ని తెలంగాణ పోలీసులు ఆపేయటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు హైకోర్టు సైతం కలుగజేసుకొని.. అంబులెన్సుల్ని రాష్ట్ర సరిహద్దుల్లో ఎలా ఆపుతారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సమయంలో ఉద్రిక్తల్ని పెంచేలా.. భావోద్వేగాల్ని టచ్ చేసేలా సీఎం జగన్ మాట్లాడలేదన్న విమర్శల వచ్చింది.

అయితే.. ఎమోషనల్ గా రియాక్టు అయ్యే కంటే.. సమస్యకు పరిష్కారం వెతికే పనిలో జగన్ బిజీగా ఉన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇటీవల కాలంలో వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఏపీ ప్రజలు.. ఏపీలోనే మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వీలుగా భారీ కార్యక్రమానికి మెరుగులు దిద్దారు సీఎం జగన్. తాజాగా ఆయన నిర్వహించిన రివ్యూలో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యానికి సంబంధించిన తన వద్ద ఉన్న భారీ ప్లాన్ ను వెల్లడించారు.

వైద్యానికి అవసరమైన భారీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆయన కొత్త పాలసీని తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో విజయవాడ.. తిరుపతి.. రాజమండ్రితో సహా మొత్తంగా 16 హెల్త్ హబ్ ల్ని ఏర్పాటు చేయాలని.. అందుకోసం 30 నుంచి 50 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరూ ఏపీ నుంచి పక్క రాష్ట్రాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఉండకుండా చేయటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఏపీలో ఏర్పాటు చేసే హెల్త్ హబ్ ల కోసం ఒక్కో ఆసుపత్రికి ఐదు ఎకరాలు కేటాయించాలని.. మూడేళ్లలో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టే ఆసుపత్రులకు ఈ భూములు ఇవ్వనున్నారు. దీని వల్ల కనీసం 80కి పైగా మల్టీ.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు.. రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజీలు.. నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయని.. ప్రభుత్వం ఇచ్చే తాజా ప్రోత్సాహకంతో మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులతో పాటు.. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ముందున్న బాధ్యతగా సీఎం జగన్ చెబుతున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండేలా జగన్ ప్లానింగ్ ఆచరణలోకి వస్తే.. ఏపీకి ఉన్న వైద్య సేవల కొరత ఇట్టే తీరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News