హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్..!

Update: 2021-10-16 10:39 GMT
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు, యువ హీరో ఆది సాయి కుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడ‌క్ష‌న్ లో రూపొందే ఈ సినిమా ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోస్ లో వైభ‌వంగా జ‌రిగింది. నిర్మాత పుస్క‌ర రామ్మోహన్ రావు హీరో పై క్లాప్ ఇవ్వ‌గా.. ప్రొడ్యూసర్ కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు - లగడపాటి శ్రీధర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. సాయికుమార్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాతో శివ‌శంక‌ర్ దేవ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో నందిని/రాయ్ - అలీ రాజా --తాక‌ర్ పొన్న‌ప్ప‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనీష్ సోలోమాన్ సినిమాటోగ్ర‌ఫీ అందించే ఈ చిత్రానికి జి శేఖ‌ర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌బోతున్న ఈ మూవీ.. ఆది సాయికుమార్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. న‌వంబ‌ర్ రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''రామానాయుడు గారి ఇన్సిపిరేష‌న్ తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మా నాన్న‌గారు నేను నిర్మాత‌గా మార‌డానికి ప్రోత్సాహం అందించారు. మంచి క‌థ‌ను రెడీ చేసుకుంటే ప్రొడ్యూస‌ర్ గా అవ‌కాశం ఇస్తాన‌న్నారు. దేవ్ చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చ‌డంతో ఆ క‌థ పై ఒక సంవ‌త్స‌ర కాలంగా ప‌నిచేసాము. ఆది సాయికుమార్ గారికి ఈ క‌థ చాలా ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. ద‌ర్శ‌కుడు దేవ్ చాలా టాలెంటెడ్. నాకీ అవ‌కాశం ఇచ్చిన ఆది సాయికుమార్ గారికి ధ‌న్యావాదాలు. నిర్మాత‌గా నా తొలి ప్రయత్నానికి మీ అంద‌రి ఆశీస్సులు కావాలి'' అని అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ''క‌థ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నా కెరీర్ లో ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. డైరెక్టర్ దేవ్ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. చాలా డిటైల్డ్ గా ఈ సినిమా పై ప‌నిచేసాడు. శాంత‌య్య గారితో నాకు చాలా సంవ‌త్స‌రాలుగా స్నేహం ఉంది. ఆయ‌న కుమారుడు నిర్మాత‌గా నా సినిమా తో ప‌రిచ‌యం అవ‌డం చాలా ఆనందంగా ఉంది. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ద‌స‌రా రోజున నా సినిమా ప్రారంభం కావ‌డం చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.

ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్ మాట్లాడుతూ.. ''ఇదొక క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్. ఒక కొత్త పాయింట్ తో సినిమా రూపొంద‌బోతుంది. ఆది సాయికుమార్ గారి పాత్ర చాలా ఢిఫ‌రెంట్ గా ఉంటుంది. ఒక కొత్త ఆది గారిని చూస్తారు. నాకు అవ‌కాశం ఇచ్చిన హీరో గారికి నిర్మాత అజ‌య్ శ్రీనివాస్ గారికి కృత‌జ్ఞ‌త‌లు ద‌ర్శ‌కుడిగా నా ప్ర‌య‌త్నం మిమ్మ‌ల్ని అంద‌రినీ ఆనంద ప‌రుస్తుంద‌ని న‌మ్ముతున్నాను'' అని అన్నారు.
Tags:    

Similar News