అదే రోజు.. మళ్లీ వాళ్లిద్దరి ఢీ

Update: 2018-11-14 17:30 GMT
బాలీవుడ్ వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావించి సీజన్లలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఒకటి. ప్రతి ఏడాదీ ఆ వారాంతంలో రెండు మూడు సినిమాలు రేసులో నిలుస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 15న అక్షయ్ కుమార్.. జాన్ అబ్రహాం తలపడ్డారు. అక్షయ్ సినిమా ‘గోల్డ్’.. జాన్ మూవీ ‘సత్యమేవ జయతే’ ఒకే రోజు రిలీజయ్యాయి. రెండూ వాటి వాటి స్థాయిలో బాగానే ఆడాయి. రెంటికీ మంచి వసూళ్లు వచ్చాయి. అక్షయ్ కుమార్ సినిమా క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పిస్తే.. జాన్ చిత్రం మాస్‌ కు బాగా నచ్చింది. కొంచెం ‘గోల్డ్’ సినిమాదే పైచేయి అయింది. ఈ ఇద్దరు హీరోలు వచ్చే ఏడాది కూడా అదే రోజు పోటీకి సై అంటుండటం విశేషం. వీళ్లిద్దరి కొత్త సినిమాల రిలీజ్ డేట్లను తాజాగా అనౌన్స్ చేశారు.

ఈ ఏడాది ఆర్.బాల్కి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ ఓ మోస్తరుగా ఆడింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మిషన్ మంగల్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. మహిళలు అంతరిక్షయానం చేయడం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. ఇందులో విద్యా బాలన్‌ తో పాటు దక్షిణాది కథానాయిక నిత్యా మీనన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు జాన్ అబ్రహాం కొత్త సినిమా ‘బాట్లా హౌస్’ను సైతం అదే రోజు రిలీజ్ చేయనున్నారట. 2008లో సంచలనం రేపిన బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ధూమ్-2’ దర్శకుడు నిఖిల్ అద్వాని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో జాన్ పోలీస్ పాత్ర చేస్తున్నాడు. అటు అక్షయ్ చేస్తున్నది.. ఇటు జాన్ అబ్రహాం నటిస్తున్నది దేశభక్తితో ముడిపడ్డ చిత్రాలే. మరి ఈసారి వీళ్లిద్దరి పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.


Tags:    

Similar News