'అఖండ' విజయానికి వార్షికోత్సవం

Update: 2022-12-02 07:32 GMT
బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్‌ లో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వీరి కాంబోలో మూడవ సినిమా గా అఖండ రాబోతుంది అంటూ ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా అఖండ సినిమా అభిమానులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా సంతృప్తి పర్చడంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

అఖండ సినిమా గత ఏడాది డిసెంబర్ 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం విడుదల అయిన అఖండ సినిమా సాధించిన వసూళ్లు నందమూరి అభిమానులతో పాటు అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు ఈ మధ్య కాలంలో అత్యధిక థియేటర్స్‌ లో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమా గా కూడా అఖండ నిలిచింది.

బాలకృష్ణ ద్వి పాత్రాభినయం చేసిన అఖండ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్‌ నటించింది.

ముఖ్య పాత్రలో పూర్ణ కూడా కనిపించారు. ఇంకా శ్రీకాంత్‌ మొదటి సారి ఈ సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అఖండ విజయం సాధించిన బాలయ్య ఆ జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు.

బోయపాటి శ్రీను అఖండ విజయం తర్వాత సీక్వెల్‌ తీస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలు చేసిన సినిమాలు ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అఖండ విజయం ఆ విషయాన్ని మరోసారి నిరూపితం చేసింది. అఖండ విజయంకు ఏడాది పూర్తి అవ్వడంతో నందమూరి అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News