ఇండస్ట్రీకి మరో షాకింగ్ న్యూస్.. సంచలన దర్శకుడి కన్నుమూత

Update: 2020-06-19 03:30 GMT
సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న విషాదాలు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కరోనాతో కొందరు మరణిస్తే.. అనారోగ్యంతో మరికొందరు.. ఆత్మహత్యలతో ఇంకొందరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. తరచుగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలతో సినిమా ఇండస్ట్రీ వరుస విషాదాలకు లోనవుతోంది. ఏమంటూ మహమ్మారి మొదలైందో.. అప్పటి నుంచి ఇండస్ట్రీకి శాపం పట్టుకున్న తరహాలో వరుస విషాదాంతాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా మలయాళ సంచలన దర్శకుడు సాచీ కన్నుమూశారు. ఈ మధ్యనే మలయాళంలో విడుదలై.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బ్లాక్ బస్టర్ మూవీ కోషియమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన మంచి పేరును సంపాదించారు. మూడు రోజుల క్రితం గుండెపోటు రావటంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ మీద ఉంచి ఆయను చికిత్స చేశారు.

డాక్టర్లు ఎంత ప్రయత్నించినా.. ఆయన్ను రక్షించటం సాధ్యం కాలేదు. వైద్యులు చేసిన ప్రయత్నాలు వృథా  అయ్యాయి. గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. కథా రచయిత నుంచి దర్శకుడిగా మారిన ఆయన మొదటి సినిమా అనార్కలి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన కోషియమ్ సంచలన విజయంతో ఆయన టాప్ దర్శకుడిగా మారాడు. రూ.5కోట్లతో ఖర్చుతో తీసిన ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీన్ని తెలుగులోనూ రీమేక్ చేయాలని చూస్తున్నారు. అంతలోనూ ఊహించని రీతిలో ఆయన అనారోగ్యం పాలు కావటం.. ఆసుపత్రిలో చేర్చటం జరిగిపోయాయి. ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీ మరోసారి విషాదంలో మునిగిపోయింది.
Tags:    

Similar News