#RC15 క‌థ నాదే అంటూ శంక‌ర్ పై ర‌చ‌యిత ఫిర్యాదు

Update: 2021-09-03 04:12 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్.సి 15 తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోస్ లో చ‌ర‌ణ్ పై శంక‌ర్ ఫోటోషూట్ చేస్తున్నార‌ని ఇక్క‌డ వేసిన భారీ సెట్స్ లో చ‌ర‌ణ్- కియ‌రా జంట‌పై తొలిగా పాట‌ను చిత్రీక‌రిస్తార‌ని ప్ర‌చార‌మైంది.

దీనికి సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో శంక‌ర్ వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డి చ‌ర‌ణ్ తో శంక‌ర్ ముందుకు వెళుతున్నందుకు మెగా ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ మూడ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత‌లోనే చ‌ర‌ణ్ -శంక‌ర్ బృందం మ‌రో వివాదంలో చిక్కుకున్నారు.

ద‌ర్శ‌కుడు శంక‌ర్ ని వివాదాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. శంక‌ర్ ఒక తమిళ రచయిత నుండి ఒక కథను దొంగిలించాడనే ఆరోపణ ఎదురైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాజీ అసోసియేట్ సెల్ల ముత్తు తన అనుమతి లేకుండా తన కథను ఉపయోగించుకుంటున్నార‌ని దర్శకుడు శంకర్ పై ఫిర్యాదు చేశారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్ కోసం తాను కథ రాశానని శంకర్ త‌న‌ను సంప్రదించకుండా .. పైసా కూడా చెల్లించ‌కుండా త‌న స్క్రిప్టు ను కాజేశార‌ని ఆరోపించారు. ఆ మేర‌కు చెన్నైలోని రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు. రామ్ చరణ్ - కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తున్న సినిమా కోసం శంకర్ తన కథను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంత‌కుముందు క‌థార‌చ‌యిత‌ల‌తో వివాదాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా మ‌రో వివాదం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ చర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ క‌థ‌ను తెలుగైజ్ చేసే ప‌నిలో ప్ర‌ముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా బిజీగా ఉన్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. శంక‌ర్- దిల్ రాజుతో క‌లిసి క‌థా చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. ఈ నెలలోనే సినిమా ప్రారంభం కావాల్సి ఉండ‌గా తాజా వివాదం ఇబ్బందిగా మారింది. దీనిని శంక‌ర్ బృందం ప‌రిష్క‌రించుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.  దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News