'ప్రొడ్యూసర్ గిల్డ్ వేస్ట్'.. బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు..!

Update: 2022-07-29 08:30 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మార్పులను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారనే విషయాన్ని ఎవరూ పట్టుకోలేకపోతున్నారు. నష్టాల నుంచి బయటపడాలని టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి తెచ్చుకుంటే.. అంతపెట్టి సినిమాలు చూడలేమంటూ జనాలు అసలు థియేటర్లకు రావడమే తగ్గించేశారు. దీంతో హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై చర్చించిన ప్రొడ్యూసర్స్ .. ఆగస్ట్ 1వ తేదీ నుంచి షూటింగ్స్ బంద్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని.. వారిని థియేటర్ కు రప్పించడం ఇప్పుడొక సవాల్ గా మారిందని ఆయన అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు.

సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని అశ్వినీ దత్ అన్నారు. వాళ్లే ఇప్పుడు షూటింగ్స్ బంద్ చేస్తున్నామని అంటున్నారు. నిర్మాతల సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైందని.. అయితే ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు ఏర్పాటైందో అర్థం కావడం లేదన్నారు. హీరోలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్లే.. సినిమా టికెట్ రేట్లు పెంచారనేది వాస్తవం కాదని ఆయన అన్నారు.

అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. అశ్వినీదత్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. అశ్వినీదత్ కు 50 ఏళ్లు సినీ నిర్మాణ రంగంలో అనుభవం ఉంది. ఏ హీరోను డైరెక్టర్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత లేదని.. అలా అడగకూడదన్నారు.

కార్లలో అనేక రకరకాలు ఉంటాయి.. అన్ని కార్లే అయినా ఒక్కో కారుకు ఓ రేటు ఉంటుంది. అందరూ హీరోలే అయినా ఒక్కో హీరోకు ఒక్కో రేటు ఉంటుంది. ఎవరి రేంజ్ వాళ్లకు ఉంటుంది. మనకు నచ్చి మనం ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలుసుకొని హీరోలతో సినిమాలు తీయాలి కానీ.. హీరోలు - డైరెక్టర్లు రెమ్యునరేషన్ తగ్గించాలనేది తప్పుడు వాదన అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

హీరో రేంజ్ ఎంత పెరిగితే మనకు అంత డబ్బు వస్తుంది. కాకపోతే మనం వేస్ట్ లేకుండా అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. ఏ రోజు ఏ లైట్స్ వాడుతురో.. ఏ లోకేషన్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలియని వాళ్లు సినిమాలు తీస్తున్నారు అని బండ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

నటుడిగా ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో పని చేశానని.. తనను ఇండస్ట్రీ ఎప్పుడూ నిరుత్సాహ పరచలేదని తెలిపారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్.. ఒక ఛాంబర్ - కౌన్సిల్ ఉన్నాయి.. దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలన్నారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉన్నారని.. వాళ్లకు సినిమా అంటే ఏం తెలుసని బండ్ల గణేష్ ప్రశ్నించారు.

వడ్డీలు హీరోలు దర్శకుల రెమ్యునరేషన్స్ తగ్గిపించాలని కాదు మనం ఆలోచించాల్సింది.. వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి.. పర్ఫెక్ట్ గా సినిమా తీయాలి.. తీసిన ప్రతీ సీన్ స్క్రీన్ మీద ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పేపర్ మీదే ఎడిటింగ్ చేసుకొని.. స్టోరీ బోర్డ్ వేసుకొని సినిమా చేస్తే బ్లాక్ బస్టర్స్ వస్తాయి అని బండ్ల గణేష్ అభిప్రాయ పడ్డారు.

కాగా, 'సీతారామం'విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అశ్వినీ దత్ మాట్లాడుతూ.. ''ధరలు పెంచకముందే ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. సినిమా హాల్ క్యాంటీన్లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈలోపు ఓటీటీలు వచ్చాయి.. దండయాత్ర చేస్తున్నారు. కానీ థియేటర్ కు జనం రాకుండా ఓటీటిలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం'' అని అన్నారు.

'హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్ ధర ప్రకారమే హీరోలు రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్ ధరలు పెంచారనేది అవాస్తనం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్- నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు' అంటూ సీనియర్ నిర్మాత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News