త్రివిక్రమ్ తో చరణ్ సినిమా ఉంటుంది: స్టార్ ప్రొడ్యూసర్

Update: 2022-02-12 09:34 GMT
టాలీవుడ్ లో సురేశ్ ప్రొడక్షన్స్ .. గీతా ఆర్ట్స్ తరువాత, దిల్ రాజు .. మైత్రీవారు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ నాలుగు కూడా పెద్ద బ్యానర్లే. ఈ నిర్మాణ సంస్థల్లో పనిచేయడం తమ అదృష్టంగా అంతా భావిస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో సితార బ్యానర్ పేరు కూడా పెద్ద బ్యానర్ల జాబితాలో చేరిపోయింది. ఈ బ్యానర్ పై వచ్చిన చాలా సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ వెళుతున్నాయి. ఒక రంకంగా ఇది హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ వంటిదే. అందువలన ఈ బ్యానర్లోని సినిమాలలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది.

సితార బ్యానర్ పై నిర్మితమైన 'డీజే టిల్లు' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన సూర్యదేవర నాగవంశీ, ఈ సారి యూత్ ను టార్గెట్ చేసుకుని కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న సినిమా చేయడం విశేషం. ఇక ఆ తరువాత ఆయన నిర్మించిన 'భీమ్లా నాయక్' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ,  కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

మా బ్యానర్ పై నిర్మితమయ్యే సినిమాల స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలపై త్రివిక్రమ్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ఆయన సలహాలు .. సూచనలతోనే ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. మా బ్యానర్లో పవన్ 'భీమ్లా నాయక్' చేయడంలోను త్రివిక్రమ్ గారి ప్రమేయం ఉంది. ఇక పవన్ తో మరో సినిమా చేయాలని ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందనేది చూడాలి. ఇక బన్నీ .. చరణ్ లతోను సితార బ్యానర్లో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. చరణ్ తో సినిమా చేసినా అది త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

పవన్ తో మూడు సినిమాలు .. అల్లు అర్జున్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్, మహేశ్ బాబుతో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబినేషన్స్ లో అల్లు అర్జున్ కి హ్యాట్రిక్ హిట్ దక్కడం విశేషం. ఇక 'అరవింద సమేత'తో ఎన్టీఆర్ కి భారీ విజయాన్ని అందించిన త్రివిక్రమ్, త్వరలో ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఇక చరణ్ తో మాత్రం త్రివిక్రమ్ ఇంతవరకూ సినిమా చేయలేదు. అందువల్లనే సూర్యదేవర నాగవంశీ ఈ కాంబినేషన్ పై దృష్టి పెట్టి ఉండొచ్చు.

ప్రస్తుతం చరణ్ .. శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో మూడో షెడ్యూల్ షూటింగుకు రెడీ అవుతోంది. ఇక ఆ తరువాత ఆయన గౌతమ్ తిన్ననూరి .. కొరటాల .. సుకుమార్ సినిమాల్లో చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ ప్రాజెక్టుల తరువాత త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఈ లోగా మహేశ్ .. ఎన్టీఆర్ సినిమాలను త్రివిక్రమ్ పూర్తిచేసేసి రెడీగా ఉంటాడేమో!   
   
Tags:    

Similar News