దాసరి ప్రేమకథ.. అలా మొదలైంది

Update: 2017-05-31 09:09 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావుకు.. తన భార్య పద్మతో ఉన్న అనుబంధం గురించి తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. పద్మ మీద దాసరి అమితమైన ప్రేమ చూపించేవారు. ఆమె దాసరి మనసు తెలుసుకుని.. అందుకు తగ్గట్లు నడుచుకున్నారు. దాసరి పరిశ్రమలోని చాలామందికి తండ్రిలాగా వ్యవహరిస్తే.. పద్మ తల్లిలాగా వ్యవహరించింది. ఇండస్ట్రీలో వందలాది మంది దాసరి పద్మను అమ్మా అని సంబోధించేవాళ్లు. ఎంతోమందికి ఆమె అన్నం పెట్టింది. ఆశ్రయమిచ్చింది. తన మనసు తెలుసుకుని నడుచుకునేది కాబట్టే భార్య అంటే అంత ప్రేమ చూపించేవారు దాసరి. కొన్నేళ్ల కిందట పద్మ చనిపోయినప్పుడు దాసరి విలవిలలాడిపోయారు. అప్పట్నుంచే ఆయన నెమ్మదించారు. దిగాలు పడ్డారు. ఇప్పుడు తన భార్య దగ్గరికే వెళ్లిపోయారు.

దాసరి.. పద్మలది ప్రేమ వివాహం కావడం విశేషం. వారి పరిచయం చాలా చిత్రంగా జరిగింది. దర్శకుడు కాకముందు దాసరి నాటకాల్లో నటించేవారు. నాటకాలు రాసేవారు. అప్పటికి సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండేది. హైదరాబాద్ కు నెమ్మదిగా ఇండస్ట్రీ మళ్లుతున్న సమయంలోనే దాసరి ఇక్కడికి వచ్చేశారు. కొన్ని ఉద్యోగాలు అవీ చేస్తూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో ఒకసారి ఊరెళ్లేముందు తన చెల్లికి గాజులు కొందామని సుల్తాన్ బజార్ వెళ్లారట దాసరి. షాపు వాడు సైజు అడిగితే పక్కన ఉన్న ఓ అమ్మాయిని చూపించి తనకు సరిపడే గాజులు ఇవ్వమన్నాడట. నాటకాలంటే చాలా ఇష్టమున్న పద్మ.. అప్పటికే దాసరి వేసిన కొన్ని నాటకాలు చూసిందట. మీరు ఫలానా కదా అని పరిచయం చేసుకుందట. అలా మొదలైన పరిచయం తర్వాత స్నేహంగా మారింది. ఆపై ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News