గీతా ఆర్ట్స్ వారి 'వినరో భాగ్యము విష్ణు కథ'

Update: 2022-01-07 06:30 GMT
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు యువ నిర్మాత బన్నీ వాసుతో కలిసి మీడియం బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధంగా 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' అనే మరో బ్యానర్ ను స్థాపించి న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో యువ దర్శకులను కుర్ర హీరోలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు.

ఇటీవల అఖిల్ అక్కినేనికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన జీఏ2 పిక్చర్స్ సంస్థ.. ఇప్పుడు లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరంతో ఓ సినిమాని రూపొందిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించే ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి ''వినరో భాగ్యము విష్ణు కథ'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. జీఏ2 వాళ్ళు మొదటి నుంచీ తమ సినిమాలకు పెద్ద పెద్ద టైటిల్స్ పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రొడక్షన్ నెం.7 కోసం తమకు అచ్చొచ్చిన దారిలోనే వెళ్తున్నట్లు టైటిల్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా ద్వారా 'మనం ఇతరుల కోసం చేసేదే గొప్ప మేలు' అనే లైన్ ని చెప్పబోతున్నారు.

త్వరలోనే హెల్పింగ్ నేచర్ ప్రారంభం కాబోతోంది అంటూ మేకర్స్ తాజాగా విడుదల చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కొండకు సమీపాన ఉన్న ఓ ఊరుని చూపిస్తూ.. అందులో ఒక దేవాలయం - పెద్ద ఇల్లు - బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి మరియు ఒక డాగ్ ని చూపించారు. ఇతరులకు సహాయం చేసే విష్ణు అనే యువకుడికి సంబంధించిన కథాంశం అని తెలుస్తోంది.

'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంలో కిరణ్ సరసన కశ్మీరా పర్దేశీ హీరోయిన్ గా నటిస్తోంది. 'నర్తనశాల' సినిమాతో తెరంగేట్రం చేసిన కశ్మీరా.. ఇంతకముందు 'ఒరేయ్ బామ్మర్ది' 'రైడర్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరాఠీ హిందీ తమిళ కన్నడ భాషల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తోంది.

కిరణ్ అబ్బవరం కెరీర్ లో 7వ సినిమాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' తెరకెక్కనుంది. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. విశ్వాస్ డానియెల్ సినిమాటోగ్రఫీ.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ ట్వీట్ చేస్తూ.. ''వారి సినిమాలు చూడటం నుండి అందులో భాగం కావడం అనేది నా పెద్ద కలలలో ఒకటి. నన్ను నమ్మినందుకు అల్లు అరవింద్ సార్ మరియు బన్నీ వాస్ గారికి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.


Tags:    

Similar News