ఫేస్‌ బుక్ లో పరిచయం..పెళ్లికి ఒప్పుకోలేదని నటి పై కత్తితో దాడి!

Update: 2020-10-27 13:50 GMT
ప్రముఖ టీవీ నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తి తో అతి కిరాతకంగా దాడి చేశాడు. ముంబైలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను హుటాహుటిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం నటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై వెర్సోవా పోలీస్ స్టేషన్ ‌లో కేసు నమోదైంది. ఈ దాడిలో ఒక్కరే పాల్గొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ సందర్భంగా పోలీసు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉత్తర ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని ఒక కేఫ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీపై నిందితుడు యోగేశ్‌ కుమార్‌ కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌ మెంట్ ‌లో యోగేశ్‌ కుమార్‌ తనకు ఏడాదిగా తెలుసని, ఇద్దరం స్నేహితులమని తెలిపింది. ఈ క్రమంలో యేగేశ్‌ మాల్వీని వివాహం చేసుకోవాలని భావించాడు. ఆమె ఒప్పుకోలేదు. అంతేకాక అతడితో మాట్లాడటం మానేసింది అని తెలిపారు. ఇదివరకు ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో సోమవారం కేఫ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న మాల్వీని యోగేశ్‌ అడ్డగించాడు. ఎందుకు తనతో మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పడంతో కత్తితో పొడిచి పారిపోయాడు. మాల్వీ ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. ఆమె శరీరంపై నాలుగు కత్తిపోట్లు ఉన్నాయని, సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. యోగేష్.. ఫేస్‌బుక్ ద్వారా మాల్వీకి పరిచయం అయ్యి , తనని ఓ నిర్మాతగా చెప్పుకుని మాల్వీతో పరిచయం ఏర్పరచుకున్నాడన్నారు. గతంలో ఒకసారి మాత్రమే ఆమె యోగేష్‌ ను కలిసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.
Tags:    

Similar News