మోహన్ బాబు..అసిస్టెంట్ డైరెక్టర్నీ వాయించాడు

Update: 2016-03-27 11:30 GMT
మోహన్ బాబును ముందు పెట్టుకుని ఎవ్వరు తోక జాడించినా అంతే సంగతులు. తన.. మన.. అనేమీ చూడకుండా వాయించి వదిలిపెడతాడాయన. నిన్న ‘ఈడోరకం ఆడోరకం’ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు నాగేశ్వరరెడ్డికి ఏ రేంజిలో వార్నింగ్ ఇచ్చాడో అందరూ చూశారు. తన కొడుకులిద్దరితో రెండు హిట్లు ఇచ్చాడని మొహమాటం కూడా చూపించకుండా స్టేజ్ మీద నాగేశ్వరరెడ్డిని కడిగేశాడాయన.

ఐతే నాగేశ్వరరెడ్డి కంటే ముందు ‘ఈడోరకం ఆడోరకం’ యూనిట్లో పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మోహన్ బాబు దెబ్బకు బెంబేలెత్తాడు. ఆ కుర్రాడు మాట్లాడుతూ.. సినిమాలో పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరి పేరు ప్రస్తావిస్తూ వారి మీద పొగడ్తలు గుప్పించాడు. ఐతే ఈ సినిమాలో ఓ పాట చేసిన సునీల్ గురించి మాట్లాడుతూ ఉండగా.. మోహన్ బాబు అభ్యంతరం చెప్పారు. కింద అతిథుల మధ్య కూర్చున్న మోహన్ బాబు మైక్ కోసం అడిగారు. రాజ్ తరుణ్ మైక్ పట్టుకెళ్లి మోహన్ బాబు ముందు కూర్చుని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశాడు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. సీనియర్ ఆర్టిస్టు అయిన రాజేంద్రప్రసాద్ పేరు చెప్పకుండా ముందు సునీల్ పేరు ఎందుకెత్తావంటూ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మీద ఫైరయ్యాడు. రాజేంద్రప్రసాద్ చాలా గొప్ప ఆర్టిస్టని.. పెద్ద పెద్ద హిట్లిచ్చాడని.. ముందు ఆయన పేరు చెప్పాలని అన్న మోహన్ బాబు.. ‘‘సునీల్ పేరు ముందు ఎందుకు చెప్పావ్.. కాకా పడుతున్నావా.. సినిమా ఏమైనా ఇస్తానన్నాడా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు ఆ కుర్రాడి ముఖంలో రక్తం చుక్క లేదు.
Tags:    

Similar News