మలయాళ హిట్ మూవీ రీమేక్ పై మనసుపడిన నాగ్!

Update: 2021-10-18 03:04 GMT
నాగార్జున తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా గ్యాప్ రాకుండా చూసుకుంటూ వస్తున్నారు. హీరోల కాస్ట్యూమ్స్ విషయంలో నాగార్జున కొత్త స్టైల్ ను ప్రవేశపెట్టారు. ఎంతోమంది కొత్తదర్శకులను పరిచయం చేశారు. కొత్త కథల విషయంలో హీరోగా సాహసాలు .. నిర్మాతగా ప్రయోగాలు చేశారు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ లకీ భిన్నమైన రూట్లో వెళుతూ, రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. అలాంటి నాగార్జున ఇప్పుడు హీరోగా తన తనయులతో పోటీపడుతూ ముందుకు వెళుతున్నారు.

రీమేక్ లకు నాగార్జున వ్యతిరేకం కాదు గానీ, మొదటి నుంచి కూడా ఆయన వాటిపై పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అలాంటి నాగార్జున ఇప్పుడు ఒక మలయాళ సినిమా రీమేక్ లో చేయడానికి రెడీ అవుతున్నారనే వార్త అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనను అంతగా ఆకట్టుకున్న ఆ సినిమా పేరే 'ది గ్రేట్ ఇండియన్ కిచన్'. ఈ ఏడాది జనవరిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిమిషా సాజయన్ .. సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రలను పోషించారు.

చాలా తక్కువ బడ్జెట్ లో .. చాలా తక్కువ రోజుల్లో షూటింగును పూర్తి చేసుకున్న సినిమా ఇది. కథగా రెండు ముక్కల్లో చెప్పుకోవచ్చు .. అలా చెప్పుకుంటే ఇందులో ఏవుంది? అనిపిస్తుంది. కానీ దర్శకుడు తన ట్రీట్మెంట్ తో మెప్పిస్తాడు. పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కొత్తగా కాపురానికి వచ్చిన ఒక యువతి, తన ఆలోచనలను .. అభిరుచులను .. అభిప్రాయాలను .. ఇష్టాలను పక్కన పెట్టేసి ఆ ఇంట్లో ఎలా సర్దుకుపోయింది? సున్నితమైన విషయాలుగానే కనిపించే కొన్ని సంఘటనలు ఆమె సహనాన్ని ఎలా పరీక్షించాయి? అనేదే కథ.

ఈ కథ పరిమితమైన పాత్రలతో సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతుంది. కొత్తగా వివాహమై అత్తవారింటికి వెళ్లిన చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే ఇది. అందువలన కథ .. పాత్రలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. అందువల్లనే ఈ సినిమా మలయాళంలో భారీ లాభాలు తీసుకొచ్చింది. అలాంటి ఈ సినిమాపై నాగార్జున దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రీమేక్ కి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ కథాంశం ఇక్కడ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం నాగ్ 'ఘోస్ట్' .. 'బంగార్రాజు' సినిమాలతో బిజీగా ఉన్నారు.




Tags:    

Similar News