నాగ్ నోట రామ్ గోపాల్ వర్మ మాట

Update: 2018-08-02 03:29 GMT
అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అనగానే ఇంతకుముందు అందరికీ ‘శివ’ చిత్రం గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ‘ఆఫీసర్’ చిత్రం గుర్తుకొస్తోంది. ఈ సినిమా ఎంత దారుణ ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాగార్జున కానీ.. వర్మ కానీ దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నాగ్ అసలు మీడియాకే దొరకలేదు. ఐతే తన మేనల్లుడు సుశాంత్ సినిమా ‘చి ల సౌ’ కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగ్ అనుకోకుండా వర్మ ప్రస్తావన తేవడం విశేషం. కానీ ‘ఆఫీసర్’ గురించి మాత్రం మాట్లాడలేదు.

తనకు బాలీవుడ్ తో ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుతూ నాగ్ వర్మ ప్రస్తావన తెచ్చాడు. ఒకప్పుడు హిందీలో వరుసగా సినిమాలు చేశానని.. ఆ సమయంలోనే వర్మ తనను బాలీవుడ్‌ కు వచ్చేయమని బలవంతం చేశాడని నాగ్ వెల్లడించాడు. ఇక్కడో  కాలు.. అక్కడో కాలు ఎందుకని.. తాను కూడా బాలీవుడ్ లోనే స్థిరపడుతున్నా కాబట్టి నువ్వూ వచ్చేయ్ అంటూ వర్మ తనను ఫోర్స్ చేసినట్లు నాగ్ వెల్లడించాడు. కానీ తెలుగు ప్రేక్షకుల మీద ప్రేమతో.. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉండటంతో తాను బాలీవుడ్ కు వెళ్లొద్దని డిసైడయ్యానని.. తెలుగు ప్రేక్షకులు తనను కింగ్ లాగా చూసుకున్నారని నాగ్ అన్నాడు.

ఆ రకంగా బాలీవుడ్ కు వెళ్లొద్దని తన నిర్ణయమే అని నాగ్ చెప్పాడు. తమిళంలో కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినా తాను అక్కడ సినిమాలు చేయలేదన్నాడు. ఏదైనా స్పెషల్ రోల్ ఉంటే తప్ప వేరే భాషల వైపు చూడలేదని.. ఇప్పుడు కూడా బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో అవకాశం తనను వెతుక్కుంటూ వచ్చిందే తప్ప.. తాను ప్రయత్నించలేదని నాగ్ చెప్పాడు. ఈ చిత్రంలో తాను 15 నిమిషాలు కనిపిస్తానని.. కానీ ఆ రోల్ చాలా ప్రత్యేకమైందని నాగ్ తెలిపాడు.


Tags:    

Similar News