'పుష్ప -2' ఎలా కొత్త ట‌ర్న్ తీసుకోబోతోంది?

Update: 2022-03-19 11:30 GMT
అల్లు అర్జున్ - స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ల కాంబినేష‌న్ లో ముచ్చ‌ట‌గా వ‌చ్చిన మూడ‌వ చిత్రం `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. రిలీజ్ హ‌డావిడిగా చేయ‌డంతో చాలా వ‌ర‌కు టీమ్ ప్ర‌మోష‌న్స్ ని ప‌క్కాగా చేయ‌లేక‌పోయింది. అయితేనేం ప్రేక్ష‌కులు, సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఈ మూవీకి ప్ర‌చార క‌ర్త‌లుగా మారి సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యేలా చేశారు. దీంతో గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో ఎవ‌రి నోట విన్నా ఒక‌టే మాట `పుష్ప‌`. త‌గ్గేదేలే అంటూ చిన్నా పెద్దా.. కామ‌న్ మ్యాన్ సెల‌బ్రిటీ అని తేడా లేకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేశారు.

వెర‌సి బాక్సాఫీస్ వ‌ద్ద క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బాక్సుల్ని బ‌ద్ద‌లు కొట్టి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. `పుష్ప‌` మేనియా ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ ఓ ఊపు ఊపేసింది. రిలీజ్ హ‌డావిడి కార‌ణంగా `పుష్ప‌` టీమ్ ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోయినా ఈ మూవీకి ఉత్త‌రాది ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఏకంగా వంద కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని అందించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో `పుష్ప‌` ఫీవ‌ర్ బాలీవుడ్ ని తాకింది.

ఈ ఫ‌లితాన్ని, ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 2` పై ప్రెజ‌ర్ పెరుగుతోంద‌ట‌. `పుష్ప 1` ని మించి పార్ట్ 2 ని ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబ‌ట్టి `పుష్ప ది రూల్‌` ని అంత‌కు మించిన ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్‌, హీరో బ‌న్నీ, మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందు కోసం భారీ ప్లాన్ నే సిద్ధం చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌తంలో ఈ మూవీని ద‌ట్ట‌మైన కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. అయితే లాక్ డౌన్ ప‌రిమితుల కార‌ణంగా ఆంధ్ర ప్ర‌దేశ్ లోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు.

అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆంక్ష‌లు ఎత్తేయ‌డంతో `పుష్ప 2` ని కేర‌ళ అడ‌వుల‌తో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అడ‌వుల్లో చిత్రీక‌రించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే పార్ట్ 1లో పుష్ప‌ని లోక‌ల్ డాన్ గా చూపించిన సుకుమార్ పార్ట్ 2 లో పాన్ ఇండియా డాన్ గా చూపించ‌బోతున్నార‌ట‌. అందులో భాగంగానే కేర‌ళ‌, అరుణా చ‌ల్ ప్ర‌దేశ్ అడ‌వుల్లో అనువైన లొకేష‌న్స్ కోసం అన్వేష‌ణ మొద‌లుపెట్టార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌న్నీ కూడా పార్ట్ 2 భారీగా వుండాల‌ని సుకుమార్ కి చెప్ప‌డంతో ప్ర‌స్తుతం టీమ్ లొకేష‌న్ ల‌ని ఫైన‌ల్ చేసే ప‌నిలో వున్నార‌ని చెబుతున్నారు.

`పుష్ప‌`లో ముంబైలో సింగ్ ని, కోల్ క‌తాలో చ‌ట‌ర్జీని.. కూడా లైన్ లో పెట్టాన‌ని చెప్పించాడు. అక్క‌డే లోక‌ల్ డాన్ ని పెద్ద‌డాన్ గా మార్చ‌బోతున్నాన‌ని హింట్ ఇచ్చేశాడు సుకుమార్ . అన్న‌ట్టుగానే డాన్ ని కాస్త పెద్ద‌డాన్ గా మార్చేస్తున్నాడు. తాజా ప‌రిణామాల‌తో `పుష్ప -2` ఇలా కొత్త ట‌ర్న్ తీసుకోబోతోందన్న‌మాట‌. ఇక ఫ‌స్ట్ పార్ట్ కు ఉత్త‌రాదిలో ల‌భించిన ఆద‌ర‌ణ‌ని దృష్టిలో పెట్ట‌కుని కొంత మంది బాలీవుడ్ న‌టుల్ని కూడా తీసుకోబోతున్నార‌ని, ఐట‌మ్ సాంగ్ కోసం బాలీవుడ్ న‌టినే దించేస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News