నితిన్ కూడా హ్యాండిచ్చాడా?

Update: 2018-11-04 04:24 GMT
తెలుగు సినిమాల్లో ఇప్పుడందరూ కొత్తదనం కొత్తదనం అంటున్నారు కానీ.. దశాబ్దంన్నర కిందటే వినూత్నమైన సినిమాలతో మన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఒక ‘ఐతే’.. ఒక ‘అనుకోకుండా ఒక రోజు’.. ఒక ‘ఒక్కడున్నాడు’.. ఒక ‘సాహసం’.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖర్ యేలేటి తీసిన ప్రతి సినిమా విలక్షణమైనదే. కమర్షియల్ గా ఏ సినిమా ఎలా ఆడిందన్నది పక్కన పెడితే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించాడతను. రొటీన్ సినిమాల వరదలో టాలీవుడ్ కొట్టుకుపోతున్నపుడు అతను భిన్నమైన దారిలో నడిచాడు. ఐతే గత కొన్నేళ్లలో యేలేటి సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాలివ్వకపోవడంతో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

‘మనమంతా’ తర్వాత యేలేటి తన తర్వాతి సినిమాను ఇప్పటికీ మొదలుపెట్టలేకపోయాడు. అతడికి నిర్మాణ సంస్థ.. హీరో కుదరట్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా మొదలయ్యేట్లే కనిపించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ‘భవ్య క్రియేషన్స్’ ప్రొడక్షన్లో నితిన్ హీరోగా ఓ సినిమా మొదలుపెడతాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అది కూడా అనుమానమే అంటున్నారు. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ‘భీష్మ’ను మొదలుపెడుతున్న నితిన్.. దీని తర్వాత సుకుమార్ శిష్యుడు.. ‘కుమారి 21 ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పాడట. దీనికి సుకుమార్ రచనా సహకారం కూడా అందిస్తాడట. యేలేటి సినిమా కంటే దీన్నే నితిన్ ముందుకు తీసుకెళ్తాడని అంటున్నారు. దీని తర్వాత చూద్దాం అని యేలేటితో అన్నాడట కానీ.. తర్వాతైనా ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా అన్నది డౌటే అంటున్నారు. యేలేటి లాంటి ప్రతిభావంతుడికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడం విచారకరమే.
Tags:    

Similar News