పూరీ.. ఛార్మీల ఈడీ విచారణ మీడియాకు అంత లేట్ గా తెలీటమా?

Update: 2022-11-18 03:27 GMT
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం హాట్ హాట్ గా మారిపోయింది. అందునా తెలంగాణలో కేంద్రం వర్సెస్ రాష్ట్రం ఎపిసోడ్ నడుస్తున్న వేళలో.. పోటాపోటీగా దాడులు.. తనిఖీలు.. విచారణలు రోజువారీ కార్యక్రమాలుగా మారాయి. గడిచిన కొద్ది రోజులుగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల కార్యాలయాల్లోనూ.. నివాసాల్లోనూ ఈడీ..ఐటీ విభాగాలకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టటం. పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించటం.. తాము స్వాధీనం చేసుకున్న డేటాను విశ్లేషించటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పలు ఫిర్యాదులు బయటకు రావటం.. అలా వచ్చిన వాటిపై స్పందిస్తున్న విచారణ సంస్థలు.. అందుకు తగ్గట్లుగా రియాక్టు అవుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ మొదట్నించి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాణం.. నిర్మాణం తర్వాత జరిపిన ప్రమోషన్.. పాన్ ఇండియాగా దీనిపై భారీగా బజ్ రావటం.. గ్రాండ్ గా రిలీజ్ చేయటం.. ఆ సందర్భంగా జరిగిన హడావుడి.. సందడి తెలిసిందే. ఇంత జరిగిన తర్వాత కూడా సినిమా అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవటం షాకింగ్ గా మారింది.

మొదటి ఆట నుంచే నెగిటివ్ రిపోర్టులు రావటంతో విజయ్ అభిమానులు డీలా పడ్డారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఈ సంచలన సినిమాకు పెట్టుబడులు పెట్టింది మరెవరో కాదని.. ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితనే ఉన్నారంటూ టీ కాంగ్రెస్ నేత ఒకరు ఫిర్యాదు చేయటం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ ఈ చిత్రానికి నిర్మాత కమ్ దర్శకుడిగా వ్యవహరించిన పూరీ జగన్నాధ్ ఖాతాలోకి విదేశాల నుంచి భారీగా నిధులు రావటాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో ఈ సినిమా నిర్మాణంలో కీలక బాధ్యతను పోషించిన చార్మీకి నోటీసులు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈడీ విచారణకు ఇద్దరు సినీ రంగ ప్రముఖులు హాజరైతే మీడియాకు కనీస సమాచారం బయటకు రాకపోవటం విస్మయానికి గురి చేస్తోంది.

విచారణకు హాజరైన సందర్భంగా ఈడీ కార్యాలయం బ్యాక్ డోర్ నుంచి పూరీ.. చార్మి వెళ్లటం ఒక కారణమైతే.. విచారణకు సంబంధించిన వివరాలు ఈడీ నుంచి అధికారికంగా కానీ.. అనధికారికంగా కానీ వెలువడలేదు. అదే సమయంలో పూరీ.. చార్మీ పీఆర్ టీం సైతం నోరు మెదపలేదు. ఇలా ఎక్కడికక్కడ సమాచారాన్ని బయటకురాకుండా చేయటంతో దీనికి సంబంధించిన వివరాలు బయటకు పొక్కలేదు.

అనుకోని రీతిలో ఒక మీడియా ప్రతినిధికి అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ విషయం బయటకు వచ్చింది. వాట్సాప్ గ్రూపులో చర్చగా మారటం.. పలువురు ఈడీఆపీసు బయట వెయిట్ చేయటంతో.. మొత్తంగా విచారణకు హాజరైన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కంప్లైంట్ చేసిన వారు యాక్టివ్ గా ఉంటూ సమాచారాన్నిఅందిస్తుంటారు. తాజా ఎపిసోడ్ లో అది కూడా జరగకపోవటంతో.. పదమూడు గంటలకు పైనే ఈడీ ఆఫీసులో పూరీ.. చార్మీ ఉన్నా.. చాలా ఆలస్యంగా ఈ సమాచారం బయటకు వచ్చినట్లైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News