'నా పరువు తియ్యాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను'.. పూరీ ఆడియో వైరల్..!

Update: 2022-10-25 03:52 GMT
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ''లైగర్''. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

'లైగర్' చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా అధిక రేట్లకు సినిమాకు కొనుగోలు చేశారు. ఈ సినిమా పరాజయం పాలవడంతో బయ్యర్లంతా భారీగా నష్టపోయారు. అయితే దర్శక నిర్మాత పూరీ కొంత మేర నష్టాన్ని పూడ్చేందుకు ముందుకు వచ్చారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

కానీ ఇంతవరకు 'లైగర్' నష్టపరిహారం అందకపోవడంతో పూరీ జగన్నాథ్ ఇంటి ముందు బయ్యర్లు ధర్నాకు దిగుతున్నారనే ఓ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పూరీ గురువు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా దీనికి సంబంధించిన ఓ ఆడియోని షేర్ చేశారు.

ఇందులో పూరీ మాట్లాడుతూ ''అన్నా.. నువ్వు పంపించిన లెటర్ చూశాను. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను.. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడ్డం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. నాకు రావాల్సింది ఉంది. ఒక నెల టైం అడిగాను''

''ఇస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే.. ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అయినా ఎగ్జిబిటర్స్ కి నాకు సంబంధం ఏంటి? ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. పేకాట ఆడతాం. కొన్ని ఆడతాయి.. కొన్ని పోతాయి. నేను ఎవరినైనా అడుగుతున్నానా?''

''వీళ్ళు మగాళ్లు కాదు. ఒక్కడు లేడిక్కడ. అదే సినిమా హిట్ అయితే బయ్యర్ల దగ్గర వసూలు చేయడానికి నానా సంకలు నాకాలి నేను. 'పోకిరి' దగ్గర నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకు బయర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి. బయర్స్ అసోసియేషన్ నాకు వాసులు చేసి పెడతారా? పెట్టదు కదా."

''నా సినిమా కొన్నవాళ్ళు అందరూ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. పైగా పెద్ద ప్రొడ్యూసర్స్. మా శోభన్ బాబు ఇండస్ట్రీలో అప్పుగా కోట్లకు కోట్లు డబ్బు ఇస్తుంటాడు. ఎగ్జిబిటర్ అంటే థియేటర్ ఓనర్. ఆడికి డబ్బులు ఉన్నాయి కదా. ఇక్కడ ఎవరూ తక్కువ కాదు. అందరూ గొప్పోల్లే. ఒక సినిమా **** వీళ్ళల్లో ఎవడో రోడ్ మీదకు రాడు. అయినా ఓవరాక్షన్. సినిమా తీస్తున్నప్పుడు బాగానే తీస్తున్నాం. కానీ రిలీట్ టైం కివీళ్ళందరీ డీల్ చేయడానికి ****''

''నార్త్ మొత్తం 'లైగర్' సినిమాని అనిల్ కు ఇచ్చాం. అతని లెక్కలు ఎంత కరెక్ట్ గా ఉంటాయో తెలుసా. మాకు ఒక ఫిగర్ వస్తది. మేము అనుకున్న దాని కంటే ఎక్కువ వచ్చిందని మాకు చూపిస్తాడు. చాలా డీసెంట్ పర్సన్. ఆయనోస్తే కూర్చొని మాట్లాడాలని అనిపిస్తది. మన బయ్యర్లు కనబడితే ****. ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యనివ్వండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని.. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇస్తా'' అని పూరీ ఫైర్ అయ్యారు.

పూరీ జగన్నాథ్ ఆడియాని షేర్ చేసిన ఆర్జీవీ.. ''ఇక్కడ బ్లాక్‌ మెయిల్‌ కు పూరీ తలొగ్గడం లేదు. నేరపూరిత బెదిరింపులకు తగిన ప్రతిఫలం'' అని ట్వీట్ చేశారు. అలానే 'లైగర్' గురించి డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ లో చక్కర్లు కొడుతున్న బెదిరింపు సందేశాలు ఇవేనంటూ ఓ వాట్సాఫ్ స్క్రీన్ షూట్ ని కూడా రామ్ గోపాల్ వర్మ పంచుకుంటున్నారు.

అందులో ''వరంగల్ శీను లైగర్ బాధితులంతా మొత్తం 83 మంది ఎగ్జిబిటర్స్ బేస్తవారం ఉదయం 9 గంటలకు 27వ తారీఖున ప్రతి ఎగ్జిబిటర్ పూరి జగన్నాథ్ గారి ఇంటికి ధర్నా కి వెళ్తున్నాము. కావున ప్రతి ఒక ఎగ్జిబిటర్ మినిమం నాలుగు రోజులు ఉండటానికి బట్టలు తీసుకొని ఎగ్జిబిటర్ తో నలుగురు వ్యక్తులను తీసుకొని రావాలి ఇలా అందరూ మాకెందుకులేని రాకపోతే ఈ బాధితుల నుంచి లిస్టులో నుంచి మీ యొక్క పేరు తొలగించి మీకు రావాల్సిన డబ్బులు అని కూడా క్యాన్సల్ చేయబడును''

''దీన్ని హెచ్చరికగా భావించకుండా తప్పనిసరిగా రాగలరు. ఎవరు ఆరోజు రాకపోయినా నుంచి మీకు మేము ఫోన్ చేయము ఇన్ఫర్మేషన్ ఇవ్వము. అందరూ బాధితులమే.. కాబట్టి అందరూ బాధ్యతగా వస్తేనే బాగుంటుంది రాకపోతే మీ ఇష్టం. అందరూ ఉదయ రెడ్డి వేణు వేణుగోపాల్ రెడ్డి ఆఫీస్ కి రావాలి. అక్కడి నుంచి పూరి జగన్నా ఇంటికి వెళ్లాలి మళ్లీ మళ్లీ చెప్తున్నాము. దయచేసి మీరందరూ రావాలి మీరు పైసలు వద్దు అనుకున్న వాళ్లు మాత్రం రాకండి'' అని పేర్కొనబడింది. ప్రస్తుతం ఈ మెసేజ్ మరియు పూరీ ఆడియో హాట్ టాపిక్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News