మా గొడవల గురించి యాంగ్రీ మ్యాన్

Update: 2019-03-03 11:21 GMT
ఇంకో వారం రోజుల్లో జరగబోయే మా ఎన్నికల ప్రహసనం మెల్లగా వేడిని రాజేస్తోంది. గత ఏడాది ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా నటుడు నరేష్ మీడియాకెక్కి నానా మాటలు అనేసుకుని తర్వాత రాజీ పడిన తతంగం ఇంకా మర్చిపోలేదు. ఇద్దరికీ సర్దిచెప్పి అప్పటికి ఏదో మమ అనిపించారు కాని అది నివురు గప్పిన నిప్పులా చల్లారలేదని ఇప్పుడు నరేష్ ఎన్నికల్లో నిలబడటంతో క్లారిటీ వచ్చేసింది. తనకు మద్దతుగా రాజశేఖర్ జీవిత దంపతులు అండగా నిలవడం వాతావరణాన్ని రంజుగా మార్చేసింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ గతంలో విభేదాలు వచ్చిన మాట నిజమే అని వాటి గురించి ఇప్పుడు గుర్తు చేసుకోవడం అనవసరమని తనకు పోటీ చేసే ఆసక్తి లేనందువల్లే సమర్ధుడైన నరేష్ కు సపోర్ట్ ఇస్తున్నామని ప్రకటించాడు. అంతే కాదు గతంలో రాష్ట్ర రాజకీయాల్లోకి వైఎస్ ఆర్ ఎన్టీఆర్ లు రమ్మని పిలిచినప్పుడే ఆసక్తి లేక వదులుకున్నానని అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పడం విశేషం

అంతే కాదు తమిళ్ నడిగర్ సంఘంతో మాకు పోలిక తెచ్చేసారు రాజశేఖర్. విశాల్ నాజర్ లాంటి వాళ్ళు అక్కడ సమర్దవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అలాంటి నాయకత్వం కావాలనే ఉద్దేశంతో నరేష్ కు తోడుగా వచ్చామని చెప్పారు. ఇలా పక్క రాష్ట్రం అసోసియేషన్ తో పోలిక తీసుకురావడం ద్వారా రాజశేఖర్ శివాజీరాజా ఏమి చేయలేదని చెప్పకనే చెప్పినట్టే. ఐక్యత లేదని చెప్పడం కూడా ఒకరకంగా అటు వైపు వర్గానికి నెగటివ్ పబ్లిసిటీ తెచ్చేదే. శివాజీరాజా ఈ కామెంట్స్ కి ఇంకా నేరుగా బదులు చెప్పలేదు కాని మార్చ్ 10న జరిగే ఎన్నికలలోపు చాలా డ్రామా నడవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది
Tags:    

Similar News