ఎవరికి ఓటు వేయాలో తెలుసు..ఏం సినిమా చూడాలో తెలియదా?

Update: 2019-11-30 12:02 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడేస్తాడు. తనకు ఏది అనిపిస్తే అదే సినిమా తీస్తాడు.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు తాను అనుకున్నట్లుగా కామెంట్స్‌ చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి వర్మ కొన్ని సార్లు మాట్లాడే మాటలు.. ఆయన వ్యవస్థపై కొన్ని సార్లు చేసే వ్యాఖ్యలు ఆలోచిస్తే అవును కదా అనిపిస్తుంది. ఇటీవల ఆయన తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్‌ సమస్య వచ్చింది.

సినిమా టైటిల్‌ ను మార్చినా కూడా సెన్సార్‌ క్లియరెన్స్‌ రాలేదు. దాంతో నిన్న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అలియాస్‌ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదల కాలేదు. తన సినిమా విడుదల కాకపోవడంతో రామ్‌ గోపాల్‌ వర్మ సెన్సార్‌ బోర్డు పై పీకల్లోతు కోపంతో ఉన్నాడు. సెన్సార్‌ బోర్డు పై గతంలోనే వర్మ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఇండియాలో అసలు సెన్సార్‌ బోర్డు అక్కర్లేదంటూ వర్మ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడిన వర్మ సెన్సార్‌ బోర్డు తీరుపై విరుచుకు పడ్డాడు. జనాలకు ఏ పార్టీకి ఓటు వేయాలి.. ఎవరిని నాయకుడినిగా ఎన్నుకోవాలనే విజ్ఞత ఉన్నప్పుడు వారు ఏ సినిమా చూడాలి.. ఎలాంటి సినిమాలను పక్కన పెట్టాలనే విజ్ఞత లేదనుకుంటున్నారా. సెన్సార్‌ వ్యవస్థకు కాలం చెల్లింది. ఈ కాలం చెల్లిన వ్యవస్థకు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వర్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం మంది వర్మ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.

వర్మ అన్నట్లుగా అసలు సెన్సార్‌ అవసరం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్‌ లేని సినిమాను ఇండియాలో చూస్తామా అంటే అనుమానమే. ఎందుకంటే మన దేశంలో సినిమాకు సెన్సార్‌ వ్యవస్థ ముడిపడి ఉంది. దాన్ని నుండి సినిమాను విడదీయాలని చాలా మంది అనుకోరు. ఆ నిర్ణయాన్ని రాజకీయ నాయకులు కూడా తీసుకోరు. అందువల్ల వర్మ కోరుకున్న సెన్సార్‌ వ్యవస్థ రద్దు అనేది ఇప్పట్లో జరుగక పోవచ్చు.
Tags:    

Similar News