ఫిప్టీ ప్లస్ లో బోల్డ్ సీన్లు.. లవ్ స్టోరీస్ చేస్తారన్న సీనియర్ హీరోయిన్

Update: 2022-06-23 04:43 GMT
ఒకసారి ఒకలాంటి ఇమేజ్ వచ్చిందంటే అది అంత త్వరగా పోదు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. సినిమా రంగానికి వస్తే.. అందునా హీరోయిన్ల విషయంలో ఒకలాంటి ముద్రపడితే.. అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. దాని నుంచి బయటకు రావటానికి సదరు నటీనటులు ప్రయత్నించినా.. దర్శక నిర్మాతలు అందుకు భిన్నంగా ఆలోచించటానికి తెగ ఆలోచిస్తుంటారు.

అలాంటి కోవకే చెందుతారు సీనియర్ నటి అర్చన. తన అద్భుత నటనతో రెండుసార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఆమె తెలుగు సినిమాలకు కాస్తంత దూరంగానే ఉన్నారు. దీనికి కారణం ఆమెను అనే కంటే.. దర్శక నిర్మాతల్ని అనాల్సిందే.

అలాంటి ఆమె సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో నటించిన చిత్రం 'చోర్ బజార్'. ఈ శుక్రవారం విడుదల అవుతున్న ఈ మూవీలో ఆకాష్ పూరి.. గెహనా సిప్పీ జంటగా నటించారు. 300 చిత్రాలకు పైనే హీరోయిన్ గా నటించిన అర్చన అన్నంతనే.. ఆమెకు ఒకలాంటి ఇమేజ్ ను కట్టబెట్టేశారు. అందులోనే ఆమెను ఉంచేశారు తప్పించి.. బయటకు తీసకురాలేదు. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

దీనికి తోడు తాను చెన్నైలో ఉండిపోవటంతో హైదరాబాద్ కు రాలేకపోయినట్లుగా పేర్కొన్నారు. తెలుగులో గ్యాప్ వచ్చిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఉండే పరిమితుల్ని ప్రస్తావించారు. ఒకప్పుడు హీరోకు హీరోయిన్ గా నటించిన నటి.. కొంతకాలానికి అదే హీరోకు సోదరి.. వదిన.. తల్లి.. అత్తగా కూడా నటించాల్సి వస్తుందని.. సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఉండటం లేదన్నారు.

అదే సందర్భంగా మరాఠి సినిమాల్లో మహిళలకు వైవిధ్యమైన పాత్రలు లభిస్తున్నట్లు పేర్కొన్నారు. తన వయసు ఉన్న వారు లవ్ స్టోరీస్ నటిస్తూ.. బోల్డ్ సీన్లలోనూ నటిస్తున్న వైనాన్ని అర్చన పేర్కొన్నారు.

ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న ఆమె వ్యాఖ్యలు టాలీవుడ్ లోనే కాదు.. సినీ అభిమానులకు సరికొత్తగా ఉన్నాయనే చెప్పాలి. మరి.. ఆమె మాటల్ని దర్శక నిర్మాతలు ఎంతవరకు అర్థం చేసుకుంటారో?
Tags:    

Similar News