కరోనా టైంను కవర్‌ చేసే ప్రయత్నంలో శర్వానంద్‌ కూడా..!

Update: 2020-09-30 02:30 GMT
కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల పాటు సినిమా పరిశ్రమ స్థంభించి పోయింది. గత నెల వరకు షూటింగ్స్‌ కనీసం 20 శాతం కూడా జరగలేదు. ఈ నెలలో యువ హీరోలు మరియు కొందరు స్టార్‌ హీరోలు కూడా షూటింగ్‌ కు రెడీ అయ్యారు. వచ్చే నెలలో మరిన్ని సినిమాలు కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి. ఆరు నెలల సమయం వృదా అవ్వడంతో దాదాపు అందరు హీరోలు కూడా ఇకపై గ్యాప్‌ ఇవ్వకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ లాక్‌ డౌన్‌ లో కథలు వినడం చేశారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను స్పీడ్‌ గా పూర్తి చేసి కొత్త సినిమాలను గ్యాప్‌ లేకుండా చేయాలనుకుంటున్నారు. ఈ కరోనా గ్యాప్‌ ను కవర్‌ చేసేందుకు దాదాపు యంగ్‌ హీరోలు అంతా కూడా రెండు మూడు సినిమాలు ఇప్పటికే కమిట్‌ అయ్యారు.

యంగ్‌ హీరో శర్వానంద్ కూడా కరోనా వల్ల వచ్చిన గ్యాప్‌ ను ఫిల్‌ చేసేందుకు ఏకంగా మూడు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. ఇప్పటికే శ్రీకారం షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. ఆ సినిమా కాకుండా మహాసముద్రం సినిమాను అజయ్‌ భూపతి దర్శకత్వంలో చేసేందుకు శర్వా రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాకు శర్వా ఓకే చెప్పాడు. కొన్నాళ్ల క్రితం దర్శకుడు కిషోర్‌ తిరుమల 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను వెంకటేష్‌ తో చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ కథను విని నచ్చిన వెంకీ చేద్దామన్నారు. కాని ఏవో కారణాల వల్ల సినిమాను చేయలేదు. వెంకీ ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టడంతో అదే కథను స్వల్ప మార్పులు చేసి శర్వానంద్‌ కు వినిపించాడట.

శర్వా ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట. నేను శైలజ.. చిత్రలహరి.. ఉన్నది ఒక్కటే జిందగీ వంటి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు కిషోర్‌ తిరుమలతో శర్వా జత కట్టబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఒక మంచి కమర్షియల్‌ మూవీని వీరి నుండి ఆశించవచ్చు. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలను విడుదల చేయడం ద్వారా ఈ ఏడాది కరోనా వల్ల వచ్చిన ఆరు నెలల గ్యాప్‌ ను కవర్‌ చేసే అవకాశం ఉంటుందని శర్వా ప్లాన్‌ గా తెలుస్తోంది.
Tags:    

Similar News