కుమారుడి కెరీర్ మీద ఫోకస్ పెట్టబోతున్న స్టార్ డైరెక్టర్..?

Update: 2022-09-05 23:30 GMT
టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా రాణించిన పూరీ జగన్నాథ్.. గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కారని అనుకుంటుండగా.. ఇప్పుడు ''లైగర్'' మూవీతో డబుల్ డిజాస్టర్‌ అందుకుని ఎన్నడూ లేని నెగెటివిటీని మూటగట్టుకున్నాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా తెరకెక్కింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ స్పోర్ట్స్ మూవీ.. పేలవమైన కంటెంట్ తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. మొదటి వారం ముగిసే సమయానికి దాదాపు అన్ని థియేటర్ల నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.

'లైగర్' సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే పూరీ - విజయ్ కాంబినేషన్ లో 'JGM' (జనగణమన) అనే ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించి రెండు షెడ్యూల్స్ షూటింగ్ చేశారు. అయితే పాన్ ఇండియా లైగర్ డిజాస్టర్ గా మారడంతో.. ఇప్పుడు దర్శక హీరోల లైనప్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

'లైగర్' సినిమా పరాజయం చెందడంతో 'JGM' చిత్రాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్లు నివేదికలు వస్తున్నాయి. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ను పూరీ కనెక్ట్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందించడానికి ప్లాన్ చేయగా.. ఇప్పుడు మై హోమ్ గ్రూప్ వాళ్ళు తప్పుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని పూర్తిగా నిలిపేసి పూరి మరో ప్రాజెక్ట్ కు షిప్ట్ కానున్నారని టాక్ నడుస్తోంది.

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ తో ఓ సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు 'JGM' ను పక్కనపెట్టి కుమారుడితో మూవీ చేయాలని అనుకుంటున్నాడట. దీని కోసం ఓ కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఆసక్తికనబరుస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

'మెహబూబా' మూవీతో హీరోగా లాంచ్ అయిన ఆకాష్ పూరీ.. హిట్టు కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'రొమాంటిక్' మరియు 'చోర్ బజార్' సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు పూరీ తనయుడికి హిట్ ఇచ్చే బాధ్యత తీసుకోనున్నాడని అంటున్నారు. అలానే ఈసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించనున్నారని చెబుతున్నారు.

పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీదనే ఈ సినిమా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. ఇకపోతే 'లైగర్' భారీ డిజాస్టర్ అవడం అటు హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరీ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది.

సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ప్రమోట్ చేసి ఇలాంటి చెత్త మూవీ ఇచ్చారని టీమ్ అంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఛార్మీ కౌర్ అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

‘గయ్స్.. కాస్త శాంతించండి. సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నా.. పూరీ కనెక్ట్స్ మరింత దృఢంగా, మెరుగ్గా మళ్లీ తిరిగొస్తుంది. అప్పటి వరకు బ్రతకండి.. బ్రతకనివ్వండి’ అంటూ హార్డ్ ఎమోజీతో ఛార్మీ ఓ ట్వీట్ చేసింది. మరి త్వరలోనే పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News