దీపావళికి జాతిరత్నంతో కలిసి రానున్న 'ప్రిన్స్'..!

Update: 2022-06-21 06:30 GMT
తమిళ హీరో శివకార్తికేయన్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ క్రేజ్ ఏర్పరచుకున్నారు. 'రెమో' చిత్రంతో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధించిన వర్సటైల్ హీరో.. 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. రెట్టింపు జోష్ తో ఇప్పుడు ''ప్రిన్స్'' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.

'జాతి రత్నాలు' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ ''ప్రిన్స్'' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది శివకార్తికేయన్ కెరీర్ లో 20వ చిత్రం. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇందులో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తోంది.

కొన్ని రోజుల క్రితం 'ప్రిన్స్' టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. హీరో శివకార్తికేయన్ మరియు నటి మరియా ర్యాబోషప్క ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు.

తాజాగా ''ప్రిన్స్'' విడుదల తేదీని ఓ ఫన్నీ వీడియో ద్వారా ప్రకటించారు. శివకార్తికేయన్ మరియు అనుదీప్ సినిమా ఆలస్యమవడానికి.. రిలీజ్ డేట్ మారడానికి సీనియర్ నటుడు సత్యరాజ్ కారణమంటూ నిందిస్తున్నారు. 'బాహుబలి' కట్టప్పగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు రావడంతో ఆయన పూర్తిగా మారిపోయారని.. రిలీజ్ డేట్స్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారని శివ ఆరోపించారు.

అయితే అదే సమయంలో సత్యరాజ్ గదిలోకి ప్రవేశించడంతో.. వారిద్దరూ సైలెంట్ అయ్యారు. చివరగా హీరోయిన్ మారియా కూడా ఈ సంభాషణలో చేరింది. తెలుగు, తమిళం మరియు ఆంగ్ల భాషలలో ఈ చర్చ జరుగుతుండగా.. ఫైనల్ గా 'ప్రిన్స్' చిత్రాన్ని దీపావళి పండుగ స్పెషల్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

'జాతి రత్నాలు' తరహాలోనే అనుదీప్ ప్రమోషనల్ కంటెంట్ ను ప్రత్యేకంగా మరియు వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నాడని అర్థం అవుతోంది. ఈ దీపావళికి విడుదల కానున్నట్లు ప్రకటించిన తొలి సినిమా 'ప్రిన్స్' అనే చెప్పాలి.

విభిన్నమైన కాన్సెప్ట్ తో కంప్లీట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ప్రిన్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాండిచ్చేరి - లండన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. సత్యరాజ్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి - సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. నారాయణ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. త్వరలోనే 'ప్రిన్స్' ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News