త్రివిక్రమ్ తో మరోసారి జత కట్టిన బన్నీ..!

Update: 2022-07-26 10:43 GMT
టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా క్రేజీ కాంబో మరోసారి జత కట్టింది. అయితే ఈసారి సినిమా కోసం కాకుండా.. ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం ఇద్దరు కలిశారు.

'పుష్ప: ది రైజ్' సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ వైడ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందరితో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా పేర్కొనబడుతున్నాడు. దీన్ని క్యాష్ చేసుకోడానికి పలు కార్పోరేట్ కంపెనీలు బన్నీ వెంటపడుతున్నాయని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ ఇప్పటికే పలు బ్రాండ్‌లకు సంతకం చేశాడు. మరికొన్ని కంపెనీలు అతన్ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ కమిటైన ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ యాడ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలసి చేస్తున్న కమర్షియల్ యాడ్ కు సంబంధించిన కొన్ని సెట్స్ లోని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో బన్నీ నెత్తిన టోపీ పెట్టుకొని కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్నాడు. ఈ మధ్య అంతా పుష్పరాజ్ గెటప్ లో ఉంగరాల జుట్టు తో ఊర మాస్ లుక్ లో ఉన్న హీరో.. ఇప్పుడు ఫ్రీ హెయిర్ స్టైల్ తో క్లాస్ గా కనిపిస్తున్నాడు.

ఇంతకముందు 'రాపిడో' బైక్ టాక్సీ ప్లాట్ ఫారమ్ వాణిజ్య ప్రకటన కోసం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి పని చేసారు. ఇప్పుడు మరో కమర్షియల్ కోసం వీరిద్దరూ కలిశారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో నాలుగో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'జులాయి' 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు విజయం సాధించాయి. 'అల వైకుంఠపురములో' సినిమా అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మరి రాబోయే రోజుల్లో త్రివిక్రమ్ - బన్నీ కలిసి మరో చిత్రం చేసి అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 'పుష్ప 1' కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని భారీ స్థాయిలో రెండో భాగాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది.

మరోవైపు 'అల వైకుంఠపురములో' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయలేదు. ఎన్టీఆర్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేయడానికి రెడీ అయ్యాడు. #SSMB28 వచ్చే నెలలో సెట్స్ మీదకు రానుంది. 'అతడు' 'ఖలేజా' తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News