వైరల్ పిక్: హాలిడేలో సతీమణితో ఎన్టీఆర్ సరదా కబుర్లు..!

Update: 2022-08-01 10:08 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా మాధ్యమాలలో ఖాతాలు ఉన్నప్పటికీ.. యాక్టీవ్ గా ఉండరనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తుంటారు కానీ.. ఫ్యామిలీ గురించి పెద్దగా పోస్టులు పెట్టరు. తన వ్యక్తిగత విషయాల్లో గొప్యత పాటిస్తుంటారు. తారక్ ఫీడ్ చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.

మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా చాలా ప్రైవేట్ పర్సన్. తారక్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లే.. ఆమె కూడా పర్సనల్ విషయాలను పెద్దగా షేర్ చేసుకోదు. మిగతా హీరోల భార్యల మాదిరిగా భర్త గురించి ఎలాంటి విషయాలను ఇన్స్టాగ్రామ్ లేదా మరేదైనా మాధ్యమంలో షేర్ చేసుకోదు. అయితే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ - ప్రణతి జంట సోషల్ మీడియాలో ఓ అందమైన ఫోటోతో దర్శనమిచ్చారు.

RRR తర్వాత ఇంకా తదుపరి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లని తారక్.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి హాలీడేని ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తన భార్యతో కలిసి ఉన్న ఓ క్యాండీడ్ ఫోటోని ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో తారక్ - లక్ష్మీ ప్రణతి ఒక టేబుల్ పై ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఇద్దరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. 'ఇలాంటి క్షణాలు..' అంటూ యంగ్ టైగర్ పోస్ట్ చేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత స్టార్ హీరో పంచుకున్న ఫోటో కావడం.. భార్యాభర్తలు ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ కావడంతో ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ ఖుషీ అవుతున్నారు.

నిజానికి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. తన ఇద్దరు కుమారులు అభయ్‌ రామ్‌ - భరత్‌ రామ్‌ లతో కలిసి సరద సమయాన్ని గడుపుతుంటారు. ఖాళీ టైం దొరికితే చాలు ఫ్యామిలీతో హాలీడేకి వెళ్తూ వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు.

ఇకపోతే ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5న వివాహబంధంతో ఒకటయ్యారు. వీరి అన్యన్యమైన దాంపత్యానికి ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే తారక్-ప్రణతి తమ 11వ వెడ్డింగ్ యానివర్సరీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దంపతులతో కలిసి జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తన అర్ధాంగితో ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఆర్.ఆర్.ఆర్' తో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. కొమురం భీమ్ గా అతని నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. తారక్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో NTR31 మూవీ చేయనున్నారు.
Tags:    

Similar News