జగన్ దగ్గరికి ఎందుకెళ్లలేదు.. సురేష్‌తో బాలయ్య

Update: 2022-12-12 08:30 GMT
సినిమాల మేకింగ్, మారుతున్న పరిస్థితులు, ఇండస్ట్రీ సమస్యలు లాంటి విషయాలపై టాలీవుడ్లో చాలా అథెంటిగ్గా మాట్లాడగల అనుభవం, పరిజ్ఞానం ఉన్న అతి కొద్ది మందిలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఒకరు. ఆయన తన అభిప్రాయాలు వెల్లడించడంలో కొంచెం నిక్కచ్చిగా కూడా ఉంటారు.

మొహమాటం లేకుండా తనకు ఏమనిపిస్తే అది చెబుతారు. కొన్ని నెలల కిందట టాలీవుడ్లో నిర్మాతలే స్వయంగా షూటింగ్స్ ఆపేసి నెల రోజుల పాటు వివిధ సమావేశాలు నిర్వహించడంపై సురేష్ బాబు తన అభిప్రాయాలను ఇలాగే చెప్పారు. ఈ సమావేశాల వల్ల పైసా ప్రయోజనం లేదని తేల్చేశారు. ఇటీవల సి.కళ్యాణ్ సైతం ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేయగా..

ఆయన దిల్ రాజు వర్గానికి వ్యతిరేకం కాబట్టి అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. కానీ రాజుకు సన్నిహితుడు, చాలా విషయాల్లో ఆయనకు మద్దతుగా నిలిచే సురేష్.. రాజు నేతృత్వంలోనే జరిగిన ఆ సమావేశాల గురించి నెగెటివ్‌గా కామెంట్ చేశారు.

అసలు అలా షూటింగ్స్ ఆపడం, సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని అర్థమయ్యే తాను వాటికి దూరంగా ఉన్నట్లు సురేష్ బాబు కుండబద్దలు కొట్టారు. ఇక్కడ ప్రతి నిర్మాతా ఎవరికి వారు ఒక ఇండస్ట్రీలాగా వ్యవహరిస్తారని, ఎవరి స్వార్థం వారిదని.. ఆ సమావేశాల తర్వాత ఇండస్ట్రీలో ఏమీ మారలేదని ఆయన తేల్చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల మీద రగడ గురించి మాట్లాడుతూ.. టికెట్ల రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం తనకు నచ్చలేదని ఆయన చెప్పారు. అప్పుడు ఇండస్ట్రీలో మిగతా ప్రముఖులతో కలిసి మీరెందుకు ఏపీ ప్రభుత్వం వద్దకు వెళ్లలేదు అని నందమూరి బాలకృష్ణ కూడా తనను ప్రశ్నించారని..

కానీ అలా రేట్లు పెంచమని అడగడం కరెక్ట్ కదనిపించడంతో తాను వారి వెంట వెళ్లలేదని ఆయన చెప్పారు. టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఫుట్ ఫాల్స్ తగ్గాయని, ప్రేక్షకులు థియేటర్లకు దూరమైపోతున్న పరిస్థితి కనిపించిందని ఆయన అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News