ఏంటీ.. హాలీవుడ్ సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేస్తారా..?

Update: 2021-04-01 03:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. 'బాహుబలి' సినిమాతో వచ్చిన క్రేజ్ ని కాపాడుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే 'రాధే శ్యామ్' షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో 'సలార్' - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో 'ఆదిపురుష్' సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఓ హాలీవుడ్ రీమేక్ కోసం ప్రభాస్ ని సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

హాలీవుడ్‌ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన 'రాంబో' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ప్రకటించారు. అయితే వేరే కమిట్మెంట్స్ వల్ల సిద్ధార్థ్‌ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ‘రాంబో’ రీమేక్ బాధ్యతలు డైరెక్టర్ రోహిత్‌ ధావన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. 'హీరో పంతీ 2' సినిమా పూర్తైన తర్వాత ఈ ఏడాది చివర్లో ‘రాంబో’ను సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టైగర్‌ ష్రాఫ్‌ స్థానంలో ప్రభాస్ ని తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది.

‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌ ని డైరెక్ట్ చేయనున్న రోహిత్‌ ధావన్‌.. 'రాంబో' రీమేక్ కోసం ప్రభాస్ తో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైనా డార్లింగ్ ప్రభాస్ 'రాంబో' వంటి కల్ట్ యాక్షన్ మూవీ చేయడానికి అంత ఈజీగా ఒప్పుకోకపోవచ్చు. ఇప్పటికే 'సాహో' వంటి స్టైలిష్ యాక్షన్ మూవీ చేసిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 'రాంబో' తరహా యాక్షన్ మూవీ చేయడానికి ముందుకొస్తాడా అనేది చూడాలి.


Tags:    

Similar News