అదిరిపోయే ప్లానేసిన అనిల్
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొన్న సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే.;

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొన్న సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న విషయం తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు బోలెడు అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అనిల్ కూడా ఈ సినిమాపై హైప్ ఇస్తూ ఉన్నాడు. చిరంజీవి ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడని, ఫ్యాన్స్ చిరూని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో తాను మెగాస్టార్ ను అలానే చూపించబోతున్నానని చెప్పి సినిమాపై ఉన్న బజ్ ను ఇంకాస్త పెంచాడు.
చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ కోసం అనిల్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. మెగా157 కోసం అనిల్ చాలా కొత్త ఎట్రాక్షన్స్ ను సినిమాలో రూపొందిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో పాట పాడబోతున్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీతో పాట పాడించి సినిమాకు సూపర్ హైప్ తెచ్చిన అనిల్, ఇప్పుడు చిరూతో కూడా పాట పాడించనున్నాడని తెలుస్తోంది.
అంతేకాదు, ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో వెంకీ కోసం ఓ స్పెషల్ ఫైట్, పాటను కూడా అనిల్ డిజైన్ చేశాడని, ఆ పాటలో చిరూ, వెంకీ ఇద్దరూ కలిసి స్టెప్పులేయనున్నారని ఇన్సైడ్ టాక్. అదే నిజమైతే సీనియర్ హీరోలిద్దరూ కలిసి ఒకే సాంగ్ లో డ్యాన్సులేస్తే థియేటర్లు షేకవడం ఖాయం.
ఈ మూవీలో చిరూ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తాడని, హీరోయిన్ కు సెక్యూరిటీ గా వెళ్లినప్పుడు అతనికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో కథ ఉంటుందని అంటున్నారు. హీరోయిన్ గా పరిణీతి చోప్రా ను అనుకుంటున్నారు. పరిణీతితో పాటూ మృణాల్ పేరు కూడా వినిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.