దేవర 1.. ఈ పోస్టర్ లోనే అసలు కంటెంట్..

ముఖ్యంగా పవర్ఫుల్ దేవర క్యారెక్టర్‌పై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి

Update: 2024-09-19 10:31 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దేవర సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఇందులో తండ్రి, కొడుకు పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాడు. ముఖ్యంగా పవర్ఫుల్ దేవర క్యారెక్టర్‌పై ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ చిత్రంలో తండ్రి పాత్ర పేరు 'దేవర', అదే పేరునే సినిమాలో టైటిల్‌గా పెట్టారు.


దేవర సినిమా ప్రమోషన్లు అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం హడావిడి గట్టిగా కనిపిస్తోంది. దేవర టీమ్ తరచూ సోషల్ మీడియాలో పోస్టర్స్, టీజర్ అప్‌డేట్స్ ద్వారా అభిమానులను అలరిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు అన్నీ ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి సింగిల్ క్యారెక్టర్ పోస్టర్లుగా మాత్రమే వచ్చాయి. తాజాగా వీరి ముగ్గురి కలయికతో ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేయడంతో, అది వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ భైరా పాత్రలో, జాన్వీ కపూర్ తంగమ్ పాత్రలో నటిస్తున్నారు. పోస్టర్ ద్వారా ఈ సినిమాలో అసలు కంటెంట్ ఈ మూడు క్యారెక్టర్ పైనే ఉంటుందని అర్ధమవుతుంది. అలాగే ఈ ముగ్గురికి కూడా ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ తో పెద్దగా సంతృప్తి చెందలేదు. అతనికి సౌత్ లో మరిన్ని అవకాశాలు రావాలి అంటే ఈ సినిమా క్లిక్కవ్వడం ముఖ్యం.

ఇక జాన్వీకి ఇప్పటివరకు సరైన హిట్ లేదు. కాబట్టి ఆమెకు కూడా ఒక బిగ్ హిట్ కావాలి. ఈ విధంగా ముగ్గురు మెయిన్ స్టార్స్ కి దేవర తగినంత బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తుండగా, ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. గతంలో శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్‌తో నటించగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి జాన్వీ తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం.

దేవర సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ధైర్యవంతుడిగా, భయాన్ని పరిచయం చేసే వ్యక్తిగా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఈ పాత్రకి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు భారీ కటౌట్స్‌తో వేడుక చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌తో ఇంటర్వ్యూ చేసి, ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్, కొరటాల శివ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 22న జరగనుందని సమాచారం.

Tags:    

Similar News