రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం.. చిన్నవయసులోనే కుమార్తె కన్నుమూత

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Update: 2024-10-05 03:54 GMT

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి వేళలో ఆమెకు గుండెపోటు రావటంతో ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కొడుకు.. కుమార్తె ఉన్నారు. కుమార్తె మరణవార్తతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు. కుమార్తె మరణంతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రిది ప్రేమ వివాహం. ఈ విషయాన్ని గతంలో రాజేంద్రప్రసాదే స్వయంగా వెల్లడించారు. ఒక సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత వివరాల్ని వెల్లడించారు. తల్లి లేని వారు తమ కూతురులోనే తల్లిని చూసుకుంటారన్న ఆయన.. ‘‘నా పదేళ్ల వయసులో నా తల్లి చనిపోయింది. తన కూతురులోనే మా అమ్మను చూసుకుంటా. కానీ.. నా కుమార్తెతో మాటల్లేవు. తాను ప్రేమించిన వ్యక్తితో ఆమె వెళ్లిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.

మరోవైపు గత నెలలోనే రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఔషధ నియంత్రణ మండలిలో పని చేస్తున్న ఆయన బెజవాడలోని రామవరప్పాడు వద్ద టూవీలర్ కు పెట్రోల్ పోసుకొని తిరిగి వెళుతున్న వేళలో.. గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో మరణించారు. ఆయనకు కొడుకు.. కుమార్తె ఉన్నారు. వారిద్దరు కెనడాలో స్థిరపడ్డారు.

ఇక.. గాయత్రి విషయానికి వస్తే.. ఆమె కుమార్తె ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించారు. మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రిగా నటించింది గాయత్రి కుమార్తే. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన గాయత్రి వైనం షాకింగ్ గా మారింది. ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని అంశాలు బయటకు రావాల్సి ఉన్నాయి.

Tags:    

Similar News