వా నువ్వు కావాలయ్యా... రజినీ చిలిపి కామెంట్స్‌

పాట షూటింగ్‌ ప్రారంభం అయ్యి రెండు రోజులు అయింది.. మూడు రోజులు అయింది. కానీ నన్ను పిలవడం లేదు.

Update: 2023-08-09 06:29 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్‌ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ నెల్సన్‌ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ను హీరోయిన్ గా నటింపజేసిన విషయం తెల్సిందే. హీరో గా ఈ సినిమా తో భారీ విజయాన్ని రజినీకాంత్ దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

తాజాగా చెన్నై లో జైలర్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. రజినీకాంత్‌ ఈ కార్యక్రమంలో దాదాపుగా గంట మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం చిత్ర దర్శకుడు, నిర్మాత గురించి మాట్లాడి వదిలేయకుండా హీరోయిన్‌ తమన్నా ఇంకా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ ను గురించి కూడా రజినీకాంత్‌ మాట్లాడటం జరిగింది.

రజినీకాంత్‌ వా నువ్వు కావాలయ్యా పాట గురించి మాట్లాడుతూ... తమన్నా తో ఆ పాట చిత్రీకరించాల్సి ఉండగా ఆమె డేట్లు ఖాళీ లేకపోవడంతో నేను లాల్ సలామ్ సినిమా షూటింగ్ కు వెళ్లాను. అయితే ఆ సినిమా షూటింగ్‌ లో ఉండగా తమన్నా డేట్లు లభించాయి అంటూ జైలర్‌ యూనిట్ మెంబర్స్ పిలవడంతో లాల్ సలామ్ సినిమాకు బ్రేక్ ఇచ్చి వచ్చాను.

అయిదు రోజుల పాటు ఈ పాట కోసం డేట్లు అడిగారు. దాంతో నేను బాగానే ప్రిపేర్ అయ్యాను. కానీ పాట షూటింగ్‌ ప్రారంభం అయ్యి రెండు రోజులు అయింది.. మూడు రోజులు అయింది. కానీ నన్ను పిలవడం లేదు. నాలో సహనం నశించి ఫోన్ చేసి నన్ను పిలవడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నించాను. మిమ్మల్ని పిలుస్తాం.. ఆ సమయం వచ్చింది అని అన్నారను.

ఐదో రోజు నాకు కాల్‌ వచ్చింది. వెళ్లి సెట్స్‌ లో కూర్చున్నాను. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు నన్ను పిలవడం లేదు. చివరకు రాత్రి 7.30 కి నాకు కాల్‌ వచ్చింది. నేను మేకప్‌ తో వెళ్లాను. ఏంటి పాటలో నేను ఉంటానా లేదా అని అడిగాను. సినిమా మొత్తం మీరే ఉంటారు. పాటలో తమన్నాను ఎక్కువగా చూపిద్దామని అనుకున్నాం అని జానీ మాస్టర్ అన్నాడు.

జానీ మాస్టర్ నాతో ఒక స్టెప్ వేయించాడు. అప్పుడు నా పక్కన తమన్నా లేదు. కనీసం తమన్నా తో మాట్లాడే అవకాశం కూడా రాలేదు అన్నట్లుగా చిలిపి వ్యాఖ్యలు చేశాడు. ఒక స్టెప్ ఆమెతో వేశాను. మరో స్టెప్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటే పాట పూర్తి అయిపోయిందని ప్రకటించారు. దాంతో నేను షాక్ అయ్యాను.

తమన్నాతో రెండు మూడు స్టెప్‌ లు.. ఆమెతో కాసేపు మాట్లాడటం ఉంటుంది అనుకున్నాను. అదేమి లేకుండానే పాట పూర్తి చేశారు. అయినా కూడా పాటకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది అన్నారు. ఇక తమన్నా గురించి మాట్లాడుతూ మంచి మనిషి.. దైవ చింతన ఆమెలో ఎక్కువ ఉండటం మంచి విషయం అన్నట్లుగా రజినీకాంత్‌ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News