RC16 కి దేవిశ్రీ ఎందుకు వాయించడం లేదు..!

కానీ చివరకు ఏఆర్‌ రహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు అంటూ అధికారిక ప్రకటన వచ్చి అందరికి షాక్ ఇవ్వడం జరిగింది.

Update: 2024-10-17 16:30 GMT

రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్ తో శంకర్ మూవీ అనగానే అంతా ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తాడని అంతా భావించారు. శంకర్‌ ప్రతి సినిమాకు రహమాన్ సంగీతాన్ని అందిస్తాడు కనుక గేమ్‌ ఛేంజర్ కి సైతం ఆయనే సంగీతాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. థమన్ వచ్చి గేమ్ ఛేంజర్‌ కి వర్క్ చేశాడు. ఇక రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబో మూవీ అనగానే దేవి శ్రీ ప్రసాద్‌ పేరు ప్రస్థావనకు వచ్చింది. కానీ చివరకు ఏఆర్‌ రహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు అంటూ అధికారిక ప్రకటన వచ్చి అందరికి షాక్ ఇవ్వడం జరిగింది.

గేమ్‌ ఛేంజర్ సినిమాకు థమన్‌ సంగీతం అందించగా, బుచ్చిబాబుతో చరణ్‌ చేయబోతున్న సినిమాకు ఏఆర్‌ రహమాన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్‌ సైతం బుచ్చిబాబు, ఏఆర్‌ రహమాన్ లు పూర్తి చేశారని తెలుస్తోంది. బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన కి దేవి శ్రీ ప్రసాద్‌తో సంగీతం చేయించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు సూపర్‌ హిట్ అయ్యి, ఉప్పెన విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే. ఉప్పెన సూపర్‌ హిట్‌ నేపథ్యంలో బుచ్చిబాబు తదుపరి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం కాస్త దూరం ఆలోచించి రహమాన్‌ వద్దకు వెళ్లాడు.

దేవి శ్రీ ప్రసాద్‌ క్రేజ్ ఏమైనా తగ్గిందా అంటే అది ఏం లేదు. ఆయన ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 తో పాటు పలు సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అయినా కూడా బుచ్చిబాబు పట్టుబట్టి మరీ ఏఆర్‌ రహమాన్‌ వద్దకు ఎందుకు వెళ్లాడు అనేది తెలియాల్సి ఉంది. సుకుమార్‌ కెరీర్‌ ఆరంభం నుంచి రూపొందిస్తున్న సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాంటి దేవి శ్రీ ప్రసాద్‌ తోనే బుచ్చిబాబు తన మొదటి సినిమాను మొదలు పెట్టారు. కానీ రెండో సినిమాకే ఏఆర్‌ రహమాన్‌ వద్దకు వెళ్లడం ఏంటో అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, మీడియా సర్కిల్స్‌లోనూ చర్చ జరుగుతోంది.

రామ్‌ చరణ్‌ 16 సినిమాకు సైతం దేవి శ్రీ ప్రసాద్ తో సంగీతం చేయించడం వల్ల సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేదేమో అని, ఎందుకు సెంటిమెంట్‌ బ్రేక్ చేస్తున్నారు అంటూ కొందరు బుచ్చి బాబును ప్రశ్నిస్తున్నారు. కానీ బుచ్చిబాబు మాత్రం తాను రూపొందిస్తున్న విలేజ్ పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామాకు ఏఆర్‌ రహమాన్ అయితే చక్కని సంగీతాన్ని ఇవ్వగలరు అని నమ్ముతున్నాడట. అందుకే ఈ సినిమా కోసం ఆయన్ను బరిలోకి దించడం జరిగింది. రహమాన్ తో పని అంటే ఎక్కువ బడ్జెట్‌ అంతే కాకుండా చాలా రోజులు పాటల కోసం, రీ రికార్డింగ్‌ కోసం వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. అయినా బుచ్చిబాబు ఆయనతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News