బీజేపీతో పొత్తు : ఏపీలో సీన్ మారిపోతుందా...!?

దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ సాయం ఉంటే కనుక కచ్చితంగా వైసీపీని ఢీ కొట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతోనే బీజేపీతో పొత్తులకు కూటమి పెద్దలు తహతహలాడుతున్నారు.

Update: 2024-03-08 01:30 GMT

ఏపీలో టీడీపీతో జనసేన కలిసింది. ఈ రెండు పార్టీలు విన్నింగ్ టీం అని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు. పవన్ కూడా వైసీపీని గద్దె దించేందుకే ఈ పొత్తులు అని చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో వైసీపీ బేఫికర్ గానే ఉంది. వై నాట్ 175 అని ముందుకు సాగుతోంది. సిద్ధం సభలతో ఫుల్ బిజీగా ఉంది.

విన్నింగ్ టీం అన్న ఇంప్రెషన్ అయితే పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లడం లేదు. పైగా పొత్తులలో లుకలుకలు ఉన్నాయి. అసంతృప్తులు అటూ ఇటూ ఉన్నాయి. మరో వైపు చూస్తే కూటమి ఎన్నికల హామీలు జనాలకు ఎంత వరకూ చేరాయన్నది కూడా చర్చకు వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైసీపీలో ఉన్న అసలు ధీమా ఏంటి అన్నది కూడా కూటమి పెద్దలకు తెలుసు అంటున్నారు.

ఎలక్షనీరింగ్ తో దెబ్బ కొట్టాలని వైసీపీ అన్ని రకాలుగా సంసిద్ధం అయింది. దాంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ సాయం ఉంటే కనుక కచ్చితంగా వైసీపీని ఢీ కొట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతోనే బీజేపీతో పొత్తులకు కూటమి పెద్దలు తహతహలాడుతున్నారు. బీజేపీకి ఏపీలో అర శాతం ఓట్ల షేర్ ఉన్నా కూడా తమ వెంట తెచ్చుకోవడానికి అధికార మంత్ర దండం ఆ పార్టీ వైపు ఉండడమే కారణం అంటున్నారు

ఎన్నికలు అంటే గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది. రేపటి రోజున ఫలితం ఎలా ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ దన్ను ఉంటే కచ్చితంగా వైసీపీతో ధీటైన రాజకీయం చేయగలమన్న ఆలోచనలతో కూడా ఈ పొత్తులను కలుపుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే వైసీపీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేసి పెట్టుకుంది. ఆ మాటకు వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లోనే వైసీపీ తన స్ట్రాటజీని అమలు చేసింది. ఎన్నికల ప్రచారం ఒక ఎత్తు. పోలింగ్ ఒక ఎత్తు. ఈ రెండు విషయాలలో వైసీపీ చాలా ముందు ఉంది. దాంతో పాటు అధికారం చేతిలో ఉంది.

స్టేట్ లో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కోవాలీ అంటే సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ జట్టుతో కలవాల్సిందే. ఈ సూత్రం తోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు అని అంటున్నారు. బీజేపీ కూటమిలో చేరితే మాత్రం ఏపీలో సక్సెస్ టీం అన్న పేరు వస్తుందా ఆ బ్రాండ్ ఇమేజ్ ని తెచ్చుకుంటారా అంటే 2014 ఎన్నికలను చూపిస్తున్నారు.

ఆ రోజున గెలిచిన కూటమి ఈ రోజునా గెలిచి తీరుతుందని అంటున్నారు. ఇక జనాలకు కూడా నమ్మకం కలుగుతుంది అని అంటున్నారు. మరి ఏపీలో బీజేపీ పట్ల పాజిటివిటీ ఉందా. జనాలు బీజేపీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారా అంటే అయోధ్య రామమందిరం ఇష్యూ తరువాత బీజేపీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత పెరిగింది అని అంటున్నారు. దాంతో పాటు మోడీ తప్ప దేశానికి మరో బలమైన నాయకత్వం లేకపోవడం తో కూడా జనాలు బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని ఫిక్స్ అయిపోయారు.

అలా గెలుపు గుర్రం లాంటి బీజేపీ కూటమితో కలిస్తే కచ్చితంగా ఏపీలో కూడా అధికారంలోకి వస్తారు అన్నది జనాలు నమ్ముతారు అని భావిస్తున్నారు. అంతే కాదు బీజేపీ కూటమిలో ఉంటే జగన్ కూడా దూకుడు చేయలేరు అన్నది కూడా కూటమి పెద్దలు భావిస్తున్నారుట. మొత్తానికి బీజేపీతో జట్టు కట్టడం పక్కా వ్యూహామే. ఈ పొత్తు కుదిరితే కనుక ఏపీలో వేవ్ విపక్షం వైపు నుంచి మొదలవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News