అటల్ టన్నెల్ లో అర్ధరాత్రి ఆ పనులేంటి? వైరల్ వీడియో
వారు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.;

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మనాలి -కీలాంగ్లను కలుపుతూ రోహ్తాంగ్ పాస్ను దాటవేసే వ్యూహాత్మక అటల్ టన్నెల్లో కొందరు ఆకతాయిలు చేసిన పని విమర్శలకు దారితీసింది. వారు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 9 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్లో ఆ వ్యక్తులు పాటలు పెట్టుకొని, నృత్యాలు చేస్తూ, చొక్కాలు లేకుండా పుష్-అప్లు కూడా చేస్తూ రచ్చ చేశారు.
జాతీయ ప్రాముఖ్యత కలిగి ఇంజనీరింగ్ అద్భుతమైన అటల్ టన్నెల్ లో ఈ పర్యాటకులు నిర్లక్ష్యంగా వినోద ప్రదేశంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. ఈ వీడియోలో కొంతమంది యువకులు టన్నెల్ పరిమితుల్లో పెద్దగా పాటలు పెట్టుకొని రచ్చ చేయడం కనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. "ఈ టన్నెల్ ఒకరోజు నైట్క్లబ్గా మారుతుందని అగ్రశ్రేణి ఇంజనీర్లు కూడా ఎప్పుడూ ఊహించలేదు" అని విమర్శలు గుప్పించారు.
దీనిపై తక్షణమే స్పందించిన కులు పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. నివేదికల ప్రకారం.. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్లు 177 , 179 కింద ఒక వాహనానికి ₹1,500 జరిమానా విధించారు. అధికారులు ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా టన్నెల్ వాతావరణంలో భద్రతా ప్రమాదాలను కూడా కలిగిస్తాయని నొక్కి చెప్పారు.
వైరల్ వీడియోపై ఆన్లైన్ లో అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. చాలా మంది ప్రజలు ప్రభుత్వ మౌలిక సదుపాయాల పట్ల పర్యాటకుల గౌరవం లేకపోవడంపై మండిపడుతున్నారు. టన్నెల్లో ఇలాంటి పనులు చేయడం చట్టవిరుద్ధమని పలువురు పేర్కొన్నారు, దీని వలన పర్యాటకులు , వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో బాధ్యతారహితంగా ప్రవర్తించే పర్యాటకులపై అధికారులు మరింత కఠినమైన చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యలలో పెట్రోలింగ్ పెంచడం, నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం.. ప్రభుత్వ మౌలిక సదుపాయాలను అగౌరవపరిచే వారికి ఎక్కువ జరిమానాలు విధించడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన ఇటువంటి కీలకమైన ప్రదేశాల పవిత్రతను , భద్రతను అందరి ప్రయోజనం కోసం కాపాడటానికి పర్యాటకులలో ఎక్కువ అవగాహన బాధ్యత అవసరమని గుర్తు చేస్తోంది.