తెలంగాణాకు బీసీ లీడర్... ఏపీకి కాంగ్రెస్ చాయిస్ ఎవరో ?

కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది.

Update: 2024-09-08 03:54 GMT

కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. తెలంగాణాలో బీసీ లీడర్ అయిన మహేష్ గౌడ్ ని తెచ్చి పీసీసీ చీఫ్ గా చేసింది. ఈ పదవి కోసం ఎంతో మంది పోటీ పడినా చివరికి ఆయన పేరు ఖరారు చేసింది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ ఈ విధంగా స్పష్టం చేసింది.

మరి ఏపెలెఓ కాంగ్రెస్ ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. విభజన తరువాత బీసీ లీడర్ అయిన ఎన్ రఘువీరారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పచెప్పింది. ఆయన చాలా కాలం ఈ కీలక పదవిలో పనిచేశారు ఆయన తరువాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాకే శైలజానాథ్ కి బాధ్యతలు అప్పగించింది.

ఇక ఓసీ అయిన గిడుగు రుద్రరాజుని కూడా పీసీసీ చీఫ్ గా చేసింది. ఈ ఏడాది మొదట్లో వైఎస్ షర్మిలను తెచ్చి పీసీసీ పీఠం అప్పగించింది. ఇక ఎన్నికల్లో చూస్తే ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ ఏ విధంగానూ పెరగలేదు. అదే టైం లో వైసీపీ ఓటమి చెందినా కూడా ఆ పార్టీ నుంచి వలసలు అయితే కాంగ్రెస్ కి రావడంలేదు.

దాంతో ఏపీలో కాంగ్రెస్ ఎత్తిగిల్లేలా కనిపించడంలేదు. షర్మిల ఉంటే వైసీపీ నుంచి వలసలు రావు అన్న చర్చ కూడా ఉంది. దాంతో పాటు సీనియర్లు కూడా ఆమె ఒంటెద్దు పోకడల మీద హై కమాండ్ కి ఫిర్యాదు చేశారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సంస్థాగతంగా తెలంగాణాలో చేసిన మార్పులు ఏపీలోనూ చేస్తుందా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఏపీ మీద ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఆ పార్టీ పోయిన చోట వెతుక్కోవాలని అనుకుంటోంది. వైసీపీ నుంచి ఓటు బ్యాంక్ వెనక్కి రావాలీ అంటే అది షర్మిల వల్ల పని కాదని అంటున్నారు. దాంతో కొత్త వారికి ఎవరికైనా పట్టం కడతారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

మరి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ని ఈ సమయంలో తీసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలపడుతోంది. దాంతో ఆ ప్రభావం ఏపీ మీద పడి 2029 నాటికి ఎంతో కొంత పార్టీ పుంజుకుంటుంది అన్న ఆశలతో ఉన్న వారూ ఉన్నారు. ఒకవేళ అది కాలేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఏపీ నుంచి కీలకంగా ఉన్న వారికి చాన్స్ దక్కుతుందని ఆ విధంగా కూడా తాము లాభపడాలీ అంటే ఇప్పటి నుంచే పార్టీలో యాక్టివ్ గా మెయిన్ రోల్ లీడ్ చేస్తూ కనిపించాలని చాలా మంది ప్లాన్ వేసుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక షర్మిల పీసీసీ చీఫ్ అయినా కొత్త కార్యవర్గం మాత్రం ఇప్పటిదాకా ఏర్పాటు చేయలేదు అని అంటున్నారు. ఆమె ఇచ్చిన లిస్ట్ కూడా అలాగే పార్టీ పెద్దల వద్దనే ఉంది. దాంతో కాంగ్రెస్ ఎందుకు ఈ విధంగా చేస్తోంది అన్న చర్చ కూడా వస్తోంది. మరి కాంగ్రెస్ పెద్దల ఆలోచనలు చూస్తే ఏపీలో కూడా బలమైన సామాజిక వర్గానికి కీలక ప్రాంతానికి చెందిన వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో నిజమెంత ఉంది అన్నది కాలమే చెప్పాలి.

Tags:    

Similar News