బెజవాడ మునక... గుర్తుకొస్తున్న బ్రహ్మం గారి జోస్యం

వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం వారు.

Update: 2024-09-02 03:52 GMT

వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు. ఆయన ఇప్పటికి అయిదు వందల ఏళ్ళ క్రితం వారు. ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజం అయ్యాయి. జనాలను నిశ్చేష్టులను చేశాయి. అలాంటి జోస్యమే ఒకటి ఆయన విజయవాడ మీద కూడా చెప్పారు. బెజవాడ లో క్రిష్ణ ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది అని బ్రహ్మం గారు ఆనాడు రాశారు.

ఇపుడు చూస్తే విజయవాడ నిండా నీట మునిగింది. ఏకంగా మోకాల్లోతు పైగా నీళ్ళతో రోడ్లు నిండిపోయాయి. ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి. బుడమేరు పొంగి పొరలి నగరం మీద పడింది. భారీ ప్రాజెక్టులు ఎపుడూ నిండవు, నిండినా అక్కడితో వాన ఉధృతి ఆగడం జరుగుతుంది. కానీ ఒకే రోజు ఏకంగా 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయితే తట్టుకోవడం కష్టమే కదా.

వాగులు వంకలు అన్నీ ఒక్కటి అయి బెజవాడ మీదకు దండెత్తి వచ్చాయి. దాంతో నగరం నీటి మాటున దాగిపోయింది. బెజవాడలో ఎటు చూసినా నీరే కనిపించింది. ఎక్కడికీ పోని నీరుతో జనం సతమతమవుతున్నారు. జనాలు అలా బిక్కుబిక్కుమంటున్నారు.

కేవలం రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి ఈ పరిస్థితి. ఇంకా మరి రెండు మూడు రోజులు భారీ వానలు కురుస్తాయని అంటున్నారు. అంతే కాదు ఎన్టీయార్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది. దాంతో ఈ భారీ వానలు ఏమి కొంప ముంచుతాయో అని అంతా తల్లడిల్లుతున్నారు.

ఇప్పటికే తిండి లేదు, ఆహారం లేదు, నీరు లేదు, నిద్ర లేదు ఇలా ఉంది బెజవాడ జనం పరిస్థితి. బెజవాడ ఎటు నుంచి ఎటు పోవడానికి అయినా కీలకమైన జంక్షన్. అలాంటి జంక్షన్ ఆగిపోయింది. దాంతో రైళ్లు బస్సులు కూడా ఆగిపోయాయి. అటు నుంచి వరకూ ఇతర రాష్ట్రాల లింక్ కూడా ఆగిపోయింది.

మొత్తం మీద చూస్తే బెజవాడ ఇప్పట్లో నీటి నుంచి బయటకు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. బెజవాడని బయటకు తేవడానికి తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన బెజవాడ వీధులలో రెస్క్యూ టీంలతో కలసి బోట్ల మీద ప్రయాణం చేశారు. అదే విధంగా బెజవాడ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకూ తాను ఎన్టీయార్ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంటాను అని కూడా బాబు ప్రకటించారు. మొత్తం మీద ఈ రకంగా వరదతో బెజవాడ నీట మునగడంతో ఇప్పటికి తాత్కాలిక చర్యలతో సరిపెడితే మాత్రం రానున్న కాలంలో ఇంతకు ఇంతా నగరం నీట మునుగుతుందని అపుడు బ్రహ్మం గారి జోస్యమే నిజం అవుతుందని జనాలు బెంగటిల్లుతున్నారు. ప్రభుత్వం తక్షణం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అంతే కాదు ఆక్రమణలను తొలగించి బెజవాడను నీరు పల్లమెరుగు అన్నట్లుగా తీర్చిదిద్దాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News