షాకిచ్చే రిపోర్టు: విదేశాలకు షిఫ్టు అవుతున్న రిచ్ భారతీయులు
దేశంలోని అత్యంత సంపన్నుల తీరుకు సంబంధించిన ఒక షాకింగ్ నివేదిక వెలుగు చూసింది.;

దేశంలోని అత్యంత సంపన్నుల తీరుకు సంబంధించిన ఒక షాకింగ్ నివేదిక వెలుగు చూసింది. మన దేశంలోని సూపర్ రిచ్ (అత్యంత సంపన్నులు) విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గుచూపటమే కాదు.. భారీగా విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు వెళ్లిపోతున్న వైనాన్ని వెల్లడించింది. కోటక్ ప్రైవేట్ - ఈవై నిర్వహించిన సంయుక్త సర్వేలో పలు షాకింగ్ అంశాల్ని వెల్లడించింది. దేశంలోని జీవన పరిస్థితుల్లో పోలిస్తే మెరుగైన జీవన ప్రమాణాలు.. సులభతర వ్యాపార వాతావరణం ఉన్న దేశాలకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలన్న యోచనలో ఉన్న వైనాన్ని వెల్లడించింది.
విదేశాంగ శాఖ డేటా ప్రకారం ప్రతి ఏడాది 25 లక్షల మంది సంపన్న భారతీయులు దేశాన్ని విడిచి పెట్టేసి.. విదేశాలకు వలస వెళుతున్నారు. రూ.25 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారు అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియా.. కెనడా లాంటి దేశాలకు వెళ్లి స్థిరపడాలని భావిస్తున్నారని.. గోల్డెన్ వీసా పథకం అమలు చేస్తున్న యూఏఈ కూడా వారిని ఆకర్షిస్తుందని పేర్కొంది.
ప్రతి ఐదుగురు కోటీశ్వరుల్లో ఒకరు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని.. భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే.. అతిథ్య దేశాల్లో పర్మినెంట్ సిటిజన్స్ మాదిరి బతకాలని కోరుకుంటున్న వైనాన్ని వెల్లడించింది. మెరుగైన లైఫ్ స్టైల్.. ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు.. చదువు.. లైఫ్ స్టైల్ లాంటివి సంపన్నులు విదేశాల్లో స్థిరపడేందుకు ప్రేరణ కలిగిస్తున్నట్లుగా రిపోర్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో విదేశాలకు వెళ్లి సెటిల్ కావాలని భావించే వారి సంఖ్య 66.66 శాతం ఉన్నట్లు వెల్లడైంది.
ఆసక్తికర అంశం ఏమంటే.. వేరే దేశానికి వలస వెళ్లటాన్ని ‘ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్’గా భావిస్తుండటం గమనార్హం. అయితే.. సంపన్నులు దేశం నుంచి వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదన్న మాటనుకోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవాంకర్ చెబుతున్నారు. సంపన్నులు విదేశాలకు వెళ్లిపోవటాన్ని దేశం నుంచి మూలధనం తరలిపోయినట్లుగా చూడొద్దంటున్నారు.
ఒక భారతీయ పౌరుడు ఏడాదికి రూ.2.15 కోట్లు మాత్రమే తీసుకెళ్లగలడని.. అదే ప్రవాస భారతీయుడైతే రూ.8.6 కోట్ల మొత్తాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. దీని వల్ల మూలధనం బయటకు వెళ్లకుండా ఉంటుందన్న విశ్లేషణ చేస్తున్నారు. 2023లో 2.83 లక్షల మంది భారతీయులు అత్యంత సంపన్నులుగా ఉన్నారు. వీరి మొత్తం సంపద విలువ రూ.283 లక్షల కోట్లు. 2028 నాటికి వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుకుంటుందని.. అప్పటికి వీరి సంపద మొత్తం రూ.359 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. ఏమైనా.. అత్యంత సంపన్నులు దేశాన్ని విడిచి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.