అదేంది మోడీ సాబ్? పదేళ్లు పవర్ ఇస్తే ఇంత అప్పు చేసి పెట్టావా?

అదేమంటే.. పదేళ్ల మోడీ హయాంలో దేశ అప్పు భారీగా పెరిగిపోవటం ఆందోళనకు గురి చేసేదిగా చెప్పాలి.

Update: 2025-02-02 04:59 GMT

దేశానికి చౌకీదార్ గా ఉంటానని తరచూ తన గురించి తాను చెప్పుకుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. పదేళ్లు నాన్ స్టాప్ గా దేశానికి ప్రధానిగా వ్యవహరించిన ఆయన.. మరో ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉండేందుకు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు రావటం తెలిసిందే. తమ హయాంలో వివిధ రంగాల్లో దేశాన్ని బలోపేతం చేసినట్లుగా కమలనాథులు చాలానే చెబుతారు. అందులో నిజాన్ని పక్కన పెడితే.. మరో చేదు వాస్తవాన్ని సైతం అంగీకరించాల్సి ఉంటుంది. అదేమంటే.. పదేళ్ల మోడీ హయాంలో దేశ అప్పు భారీగా పెరిగిపోవటం ఆందోళనకు గురి చేసేదిగా చెప్పాలి.

తాజా బడ్జెట్ లో దేశ అప్పు వివరాల్ని వెల్లడించారు. 2026 మార్చి 31 (వచ్చే ఏడాదికి సుమా) నాటికి 196,78,772.62 కోట్లుగా పేర్కొన్నారు. సింఫుల్గా చెప్పాలంటే రూ.196 లక్షల కోట్లుగా చెప్పాలి. ఈ మొత్తం అప్పులో రూ.190 లక్షల కోట్లు (ఫిగర్ పక్కాగా చెప్పాలంటే చెప్పొచ్చు కానీ.. దాని వల్ల ఆందోళన తప్పించి ఆనందం ఉండదు కదా. అందుకే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాం) దేశీయ అప్పు కాగా.. 6.6లక్షల కోట్లు విదేశీ రుణంగా చెప్పాలి.

ఈ ఏడాది మార్చి 31 నాటికి మాత్రం రూ.181 ల కోట్లకు చేరనుంది. పదేళ్ల క్రితం.. అంటే మోడీ మాష్టారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టటానికి ముందు దేశ అప్పు రూ.62వేల లక్షలకోట్లు మాత్రమే ఉండేది. మరింత సరైన అంకెల్ని చెప్పాలంటే 2015 మార్చి 31 నాటికి రూ.62,22,357.55 కోట్లుగా ఉండేది. పదేళ్ల వ్యవధిలో ఇంత భారీగా అప్పుల బారిన పడటం దేనికి సంకేతం? అన్నది ప్రశ్న. ఈ పదేళ్లలో అప్పు భారం 192 శాతానికి పెరిగింది.

అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ అప్పు ఏటా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గుతూ పోతోందని చెప్పిన ఆమె.. ఈ ఏడాది ఆర్థిక లోటు 4.8 శాతానికి తగ్గిందని.. వచ్చే ఏడాదికి 4.4 శాతానికి తగ్గించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. మరి.. దేశం మీద ఇప్పుడున్న భారీ అప్పు ఎవరిది? అన్న దానిపై క్లారిటీ ఇస్తే బాగుండు.

Tags:    

Similar News