విలువలకు, విశ్వసనీయతకు పట్టం... బాబుపై జగన్ ఫైర్!

ఈ సమయంలో... వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-28 14:17 GMT
విలువలకు, విశ్వసనీయతకు పట్టం... బాబుపై జగన్  ఫైర్!

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ కీలక స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో జెడ్పీలు, మండల పరిషత్ లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరగ్గా.. వాటిలో వైసీపీ 32 పదవులను కైవసం చేసుకుంది. ఈ సమయంలో... వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా... స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమికి ఎలాంటి బలం లేకపోయినా.. చంద్రబాబు తన అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా.. కేసులు పెట్టినా.. ఆస్తులు ధ్వంసం చేసినా.. బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని.. జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా.. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. వాటిని బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని జగన్ అన్నారు.

ఇదే సమయంలో... విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని జగన్ వెల్లడించారు.

ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ కేంద్రం కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌ అని జగన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Tags:    

Similar News