జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. అదే కారణమా?

దీనిపై విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది.

Update: 2024-09-27 10:05 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన రద్దయింది. ఆయన ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను నియమించింది.

ఈ నేపథ్యంలో జగన్‌ తిరుమల పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 27 సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. రాత్రికి తిరుమలలోనే నిద్ర చేసి సెప్టెంబర్‌ 28న ఉదయం శ్రీవారిని దర్శించుకునేలా జగన్‌ ప్రోగ్రామ్‌ ఖరారైంది.

అయితే జగన్‌ తిరుమల దర్శనానికి ముందు ఆయన నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తిరుమల దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్యమతస్తులు ఎవరైనా శ్రీవారి దర్శనానికి వచ్చే ముందు తప్పనిసరిగా తమకు శ్రీవారిపై అచంచల విశ్వాసం ఉందని పేర్కొంటూ డిక్లరేషన్‌ పై సంతకం చేయాల్సి ఉందన్నారు.

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్‌ (టీటీడీ) అధికారులు సైతం జగన్‌ నుంచి డిక్లరేషన్‌ నుంచి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 24 వరకు తిరుపతిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలకు ఆస్కారం లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు జగన్‌ తిరుమలకు వస్తే అడ్డుకోవడానికి పలు హిందూ సంఘాలు సైతం సిద్ధమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనవసరమైన గొడవలు, ఆందోళనలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే జగన్‌ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

మరోవైపు జగన్‌ శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్‌ పై సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేయడానికి ఇష్టపడకపోతే ఆయనను దర్శనానికి అనుమతించబోరని సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారని అంటున్నారు. కాగా తన పర్యటన రద్దుపై జగన్‌ మీడియాతో మాట్లాడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News