ఇమేజ్ ని ఫణంగా పెట్టి మరీ జగన్ ఫైటింగ్ ?

అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు

Update: 2024-07-31 04:04 GMT

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోసం బాగా పట్టుబడుతున్నారు. అయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా దక్కుతుంది అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన న్యాయస్థానంలో ఇదే విషయం మీద పోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు కి దాఖలు చేసిన దాంట్లో 1953 ఏపీ యాక్ట్ ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వంలో కాకుండా అవతల విభేదించే పక్షాలలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న దానిని విపక్షంగా గుర్తించవచ్చు అని ఉంది. అది కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదే పాయింట్ మీద జగన్ కోర్టు తలుపు తట్టారు. కోర్టు స్పీకర్ కార్యదర్శికి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది. ఆ తరువాత విచారణ ఎలా జరుగుతుంది, అసలు ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి సర్వత్రా ఉంది. అయితే కోర్టులు కొంతవరకు మాత్రమే అసెంబ్లీ వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకుంటాయి కానీ అంతకు మించి చేసుకోవని అంటున్నారు.

జగన్ లేవనెత్తిన పాయింట్ లో విలువ ఉంటే కనుక కోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని లేదా అసెంబ్లీ సెక్రటరీని అడుగుతుందని అంటున్నారు. ఆ విషయంలో స్పీకర్ విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని జవాబు వస్తే అపుడు మళ్లీ బంతి స్పీకర్ చెయిర్ వద్దకే వస్తుందని అంటున్నారు.

ఏపీలో చూస్తే వైసీపీకి టీడీపీకి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న నేపధ్యంలో స్పీకర్ విచక్షణతో విపక్ష హోదా ఇవ్వడం సాధ్యపడుతుందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ ఇంతలా నాయ పోరాటం విపక్ష హోదా కోసం చేయడాన్ని ఆయన అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

జగన్ డేరింగ్ డేషింగ్ ఏమైంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. వారిని ముందు పెట్టుకుని అధికార పార్టీ మీద పోరాటం చేస్తే జగన్ అంటే ఇదీ అని అందరికీ అర్ధం అవుతుందని అంటున్నారు.

జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని పారిపోతున్నారని కూటమి పెద్దలు విమర్శలు చేస్తున్నారు. వారి కంటే ఎక్కువగా పీసీసీ చీఫ్ షర్మిల కూడా విమర్శలు చేస్తోంది. జగన్ పిరికివారు చేతకాని వారు అని షర్మిల చేస్తున్న విమర్శలు ఆయన అభిమానులను బాధిస్తున్నాయి.

అయితే తన ఇమేజ్ సైతం ఫణంగా పెట్టి జగన్ చివరికి ఏమి సాధిస్తారు అన్నదే చర్చగా ఉంది ఒకవేళ జగన్ కి ఈ పోరాటంలో న్యాయం జరగకపోతే ఆయన ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది.తిరిగి పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళడమే కదా అని అంటున్నారు. అదే పని ముందు చేస్తే ఇమేజ్ పెరగడంతో పాటు ఆయన డేరింగ్ డేషింగ్ లోకానికి తెలిసి వచ్చేవని అంటున్నారు.

Tags:    

Similar News