వైసీపీ వీక్ అయితే ఒరిగేది ఏముంది చెల్లెలా ?

వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీ లో ఎవరూ మిగలరు అని షర్మిల ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ కి లాభం ఏమీ లేదు అని అంటున్నారు.

Update: 2024-09-21 03:49 GMT

పదవి కోసం వైఎస్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు ఇంకా సుదీర్ఘ నిరీక్షణ తప్పేట్లు లేదు అని అంటున్నారు. ఆమె వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ సీటు ఆశించారు అని ప్రచారంలో ఉంది. అయితే ఆమెకు నిరాకరించారు అని కూడా అంటారు. దాంతోనే ఆమె తన శక్తి ఏంటో చూపించడానికే కొత్తగా పార్టీని పెట్టి మొదట తెలంగాణాలో తన పాలిటిక్స్ ని చూపించారు.

ఆమె అక్కడ మూడేళ్ళ పాటు శ్రమించినా ఫలితం నిల్ అని తెలిసి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఆమెకు దగ్గర అయింది. ఆమెను ఏపీని 2024 ఎన్నికల ముందు తీసుకుని వచ్చారు. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రాజ్యసభ సీటు ప్రామిస్ చేశారు అని ప్రచారం సాగింది.

అయితే గడచిన ఏడెనిమిది నెలలలో పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లు ఖాళీ అయినా షర్మిల పేరు అయితే పరిశీలన స్థాయిలో కూడా లేదు అని అంటున్నారు. ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయినాక పార్టీ కనీసం పది శాతం ఓటు షేర్ ని సాధిస్తుందని అలాగే కనీసం ఒకటి రెండు అసెంబ్లీ సీట్లు అయినా వస్తాయని ఈసారి అయినా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు అని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు

కానీ అది మాత్రం జరగలేదు. ఓటు షేర్ అయితే కొద్దిగా పెరిగింది. అయితే కాంగ్రెస్ ని చీల్చి వేరు పార్టీ పెట్టుకున్న వైసీపీ ఓటమి మాత్రం కాంగ్రెస్ కి ఎంతో కొంత హుషార్ తెచ్చింది. అదే షర్మిల పీసీసీ చీఫ్ గా సాధించిన పెద్ద విజయం అని అంటున్నారు. ఆమె ప్లేస్ లో ఎవరు పీసీసీ చీఫ్ అయినా వైసీపీకి ఇంత డ్యామేజ్ జరిగేది కాదని కనీసం 40 నుంచి 50 దాకా అసెంబ్లీ సీట్లు వచ్చేవని అంటున్నారు అలా వైసీపీకి కాంగ్రెస్ దెబ్బ కొట్టింది.

మరో వైపు చూస్తే వైసీపీ ఓటమి పాలు అయినా ఆ పార్టీ నుంచి నాయకులు అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా చూస్తున్నారు. ఆ పార్టీలనే ఎంచుకుంటున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ వైపు తొంగి చూడడం లేదు. దానికి షర్మిల నాయకత్వ పోకడలే కారణం అని అంటున్నారు. ఏపీలో వైఎస్సార్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించినా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు మంత్రులు అంతా తరలి వచ్చినా ఏపీ కాంగ్రెస్ కి అయితే ఊపు రావడం లేదు.

దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం మరింత కాలం పార్టీని పటిష్టం చేసే బాధ్యతలనే షర్మిలకు అప్పగించారు అని అంటున్నారు. ఇంకో వైపు రాజ్యసభ సీట్ల కోసం గట్టి పోటీ కాంగ్రెస్ లో ఉంది. దాంతో ఏమీ లేని ఏమీ కానీ ఏపీ కాంగ్రెస్ కి ఒక రాజ్యసభ సీటుని ఆ పార్టీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు

ఇక కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ ఉనికిని చాటుకుంటూ వస్తున్న షర్మిలకు 2029 వరకూ పదవుల కోసం ఎదురుచూపు తప్పదని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ 2029 నాటికి కూడా ఎత్తిగిల్లే అవకాశాలు తక్కువే అని అంటున్నారు. దాంతో 2029 లో కేంద్రంలో కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అపుడు ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే చాన్స్ ఏమైనా ఉంటుందేమో అని అంటున్నారు. మొత్తానికి వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా షర్మిల మారినా ఆమెకు రాజకీయంగా ఉపయోగం లేదు అనే అంటున్నారు.

వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీ లో ఎవరూ మిగలరు అని షర్మిల ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ కి లాభం ఏమీ లేదు అని అంటున్నారు. వైసీపీ బలహీనపడితే టీడీపీ జనసేన బలపడతాయి తప్పించి కాంగ్రెస్ కి ఏమీ చోటు లేదని అర్ధం అవుతోంది. ఏపీ పొలిటికల్ స్పేస్ లోకి జనసేన కొత్తగా ఎమెర్జ్ అవుతోంది. దాంతో కాంగ్రెస్ కి గతంలోని ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవడం కష్టమే అని అంటున్నారు.

Tags:    

Similar News