కర్నూలు జిల్లాలో చెలరేగిన వైసీపీ మూక?.. టీడీపీ నేత దారుణ హత్య!

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయాన్ని సాధించిన తర్వాత కూడా టీడీపీకి చెందిన నేతలపైనా

Update: 2024-06-10 05:17 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయాన్ని సాధించిన తర్వాత కూడా టీడీపీకి చెందిన నేతలపైనా.. కింది స్థాయి నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ కోవలోనే కర్నూలు జిల్లాలో ఒక తెలుగు తమ్ముడ్ని వేట కొడవళ్లను వెంటాడి నరికి చంపిన ఉదంతం షాకింగ్ గా మారింది. ఎన్నికల్లో తమకు ఎదురైన దారుణ ఓటమి నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనతో తెలుగుదేశం వర్గాలు భయాందోళనలకు గురయ్యారు. సదరు గ్రామంలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లాలో హైటెన్షన్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేవారు. వేట కొడవళ్లతో వెంటాడి అతన్ని నరికి చంపాయి. దీంతో వెల్దుర్తి మండలంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దారుణహత్యలో వైసీపికి చెందిన పామయ్య.. రామక్రిష్ణ తదితరుల పాత్ర ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం కూడా కాక ముందే ఈ దారుణ హత్య చోటు చేసుకోవటంతో ప్రజలు ఉలిక్కిపడిన పరిస్థితి.

అధికారం చేజారిన తర్వాత కూడా పోలీసులు వైసీపీ నేతలకే సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తమ నేతను హత్య చేసిన వైనంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమంటూ హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత హత్యకు గురైన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దిద్దుబాటు చర్యలకు తెర తీశారు.

టీడీపీ నేతల డిమాండ్ కు సానుకూలంగా స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. హత్య జరిగిన బొమ్మిరెడ్డి పల్లెను జిల్లా ఎస్పీ పర్యటించారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పికెట్ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తమపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. మరి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతను దారుణంగా హత్య చేసిన ఉదంతంపై వైసీపీ వర్గాలు ఏం చెబుతాయని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News