అర్థరాత్రి హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. రౌడీషీటర్ దారుణ హత్య

అసలేం జరిగిందంటే.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచన్ బాగ్ లో రియాజ్ అనే రౌడీ షీటర్ ఉంటాడు.

Update: 2024-08-09 04:53 GMT

గురువారం అర్థరాత్రి వేళలో హైదరాబాద్ మహానగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అందరిని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఉదంతం మొత్తం ఒక రౌడీ షీటర్ ను హతమార్చేందుకు కావటం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచన్ బాగ్ లో రియాజ్ అనే రౌడీ షీటర్ ఉంటాడు.

అతడ్ని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఇందుకు పక్క ప్లాన్ నిర్వహించారు. బాలాపూర్ ఆర్ సీఐ రోడ్డులో వాహనం మీద వెళుతున్న రియాజ్ ను కారుతో ఢీ కొట్టారు. ఆ వెంటనే కింద పడిన అతడిపై కాల్పులు జరిపి.. హతమార్చారు. ఈ వ్యవహారం షాక్ కు గురి చేసింది. హత్య చేసేందుకు కత్తులతో.. మారణాయుధాలతో వెంటాడి చంపిన ఉదంతాలు నగరంలో పలు ఉన్నాయి.

అందుకు భిన్నంగా.. వాహనంతో ఢీ కొట్టి.. కిందపడినంతనే గన్ తో కాల్పులు జరిపి హత్య చేసిన వైనం చూసినప్పుడు.. నగరంలో పెరుగుతున్న గన్ కల్చర్ వైనం తెలుస్తుంది. ఘటన గురించి సమాచారం అందుకున్నంతనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హత్య జరిగిన ప్రాంతంలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ మీద బాలాపూర్ తో పాటు హైదరాబాద్ మహానగరంలో పలు కేసులు ఉన్నాయని.. అతను మీర్ పేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా చెప్పారు. హత్యకు కారణాలు ఏమిటి? ఎవరు చేశారు? వారి వెనుక ఉన్నది ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

Tags:    

Similar News