లూథ్రాతో పాటు మరో ఇద్దరు హేమాహేమీలు... రసవత్తరంగా వాదనలు?

దీంతో ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఎంట్రవుతుండటంతో ఈ రోజు వాదనలు రసవత్తరంగా సాగనున్నాయని అంటున్నారు.

Update: 2023-09-19 06:45 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్‌ పై తమ వాదనలు బలంగా వినిపించేందుకు చంద్రబాబు లాయర్లు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

ఈ సమయంలో చంద్రబాబుని చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారంటూ ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దీంతో ఈనెల 18 కల్లా కౌంటర్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇచ్చింది. ఆ గడువు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై హైకోర్టులో నేడు తదుపరి విచారణ చేపట్టనుంది.

మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పైనా విచారణ జరగనుంది. ఈ సమయంలో బాబు తరుపున ఈ కేసులు వాదించడానికి సిద్ధార్థ్ లూథ్రాతో పాటు ఇంకో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది.

అవును... నేడు విచారణ జరగనున్న క్వాష్, బెయిల్, మద్యంతర బెయిల్ పిటిషన్ లపై బాబు తరుపున మరింత బలంగా వాదించడానికి సిద్ధార్థ్ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ లు రంగంలోకి దిగనున్నారు. ఏపీ సీఐడీ తరుపున ముకుల్ రోహిత్గీ, రంజిత్ కుమార్ లు తమ వాదనలు వినిపించబోతున్నారు!

దీంతో ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఎంట్రవుతుండటంతో ఈ రోజు వాదనలు రసవత్తరంగా సాగనున్నాయని అంటున్నారు. మరోపక్క హారీశ్ సాల్వే ఫ్రాన్స్‌ లో ఉన్న నేపథ్యంలో... వర్చువల్ గా వాదనలు వినిపించాలని టీడీపీ లీగల్ సెల్ కోరిందట. దీంతో ఆయన ఈ రోజు వర్చువల్ గా ఫ్రాన్స్ నుంచి వాదనలు వినిపించనున్నారని తెలుస్తుంది. ఈ మేరకు న్యాయమూర్తికి విన్నపం కూడా చేశారని సమాచారం.

Tags:    

Similar News