మాజీ మంత్రి విడుదల రజినీకి బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు!
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి.;
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాషువాపై విచారణ చేపట్టేందుకు ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనుమతి పొందింది.
ఇక విడదల రజినిపై విచారణకు గవర్నర్ అనుమతిని కోరుతూ లేఖ పంపగా, ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. అనుమతి లభించిన వెంటనే అధికారికంగా కేసు నమోదు చేయనున్నారు.
- రూ.2.20 కోట్ల అక్రమ వసూళ్ల ఆరోపణలు
శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందించింది. నివేదిక ప్రకారం.. రూ.5 కోట్లు డిమాండ్ చేసి, అందులో రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. అందులో రూ.2 కోట్లు మాజీ మంత్రి విడదల రజినికి, రూ.10 లక్షలు ఐపీఎస్ అధికారి జాషువాకు, మిగిలిన రూ.10 లక్షలు రజినికి చెందిన వ్యక్తిగత సహాయకుడికి వెళ్లినట్టు ఏసీబీ విచారణలో వివరాలు బయటపడ్డాయి.
ఈ ఆధారాలపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా, అధికారులు కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులను తీసుకుంటున్నారు. త్వరలోనే అధికారికంగా విచారణ ప్రారంభం కానుంది.